roja: 'రాజీనామా' ప్రకటన చేయగానే.. టీడీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది: రోజా

  • నాలుగేళ్ల పాటు చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను ప‌ట్టించుకోలేదు
  •  మొన్నటి బడ్జెట్‌లో నిధులు ఇవ్వకపోతే చంద్ర‌బాబు నాయుడి ర‌క్తం మ‌రిగిపోతోంద‌ట‌
  • ఓటుకు నోటు కేసులో జైలుకి పోతే చంద్రబాబు మ‌ళ్లీ బ‌య‌ట‌కు రారు
  • అందుకే మోదీని ప్రశ్నించడం లేదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి చేసిన రాజీనామా ప్ర‌క‌ట‌న‌పై టీడీపీకి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న పాద‌యాత్ర‌ నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క వ‌ర్గం రేణ‌మాల‌కు చేరుకుంది. అక్క‌డి మ‌హిళ‌ల‌తో జ‌గ‌న్ ముఖాముఖిలో పాల్గొంటున్నారు.

అందులో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... నాలుగేళ్ల పాటు చంద్ర‌బాబు నాయుడు కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన సాయంపై ప‌ట్టించుకోలేదని అన్నారు. 'మొన్నటి బ‌డ్జెట్లో ఏపీకి నిధులు ఇవ్వ‌క‌పోతే చంద్ర‌బాబు నాయుడి ర‌క్తం మ‌రిగిపోతోంద‌ట' అని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు జైలుకి పోతే మ‌ళ్లీ బ‌య‌ట‌కు రారని, అందుకే ఆయ‌న మోదీ, కేసీఆర్ లను ఏమీ అన‌డం లేద‌ని అన్నారు.

ప్ర‌త్యేక హోదా చాలా అవ‌స‌ర‌మ‌ని మొద‌టి రోజు నుంచి ఈ రోజు వ‌ర‌కు జ‌గ‌న్ పోరాడుతున్నారని, ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని అని చెప్పిన చంద్ర‌బాబు మ‌ళ్లీ మాట మార్చి సంజీవ‌ని కాదని అన్నార‌ని రోజా చెప్పారు. చంద్ర‌బాబు కేసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికే ఇలా చేస్తున్నారని, యువ‌త‌కు మంచి ఉద్యోగాలు రావాలంటే ప్ర‌త్యేక హోదా రావాలని అన్నారు. ప్ర‌జ‌లు జ‌గ‌న్ చేస్తోన్న పోరాటానికి మ‌ద్ద‌తివ్వాలని అన్నారు.

వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోందని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే కేంద్ర ప్ర‌భుత్వం దిగి వ‌స్తుందని, కానీ, వారు అలా చేయ‌డం లేదని రోజా అన్నారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు, ప్యాకేజీ వద్ద‌ని అంద‌రూ పోరాడాల‌ని పిలుపునిచ్చారు. అధికారంలోకి వ‌స్తే బెల్టు షాపులు ఇక ఉండ‌వ‌ని చంద్ర‌బాబు చెప్పుకున్నారని, కానీ, ప్రతి గ్రామంలోనూ మ‌ద్యం పారుతోందని తెలిపారు.

మహిళల బాధ‌ల‌ను చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేదని, మ‌ద్యం మీద వ‌చ్చే ఆదాయ‌మే ముఖ్యం అన్న‌ట్లు ఆయ‌న‌ వ్య‌వ‌హ‌రిస్తున్నారని రోజా చెప్పారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం జ‌గ‌నన్నేన‌ని, ఆయ‌న సీఎం అయితేనే మ‌న క‌ష్టాలు తీరుతాయని రోజా వ్యాఖ్యానించారు. 

More Telugu News