Andhra Pradesh: చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటారు: మంత్రి ప్రత్తిపాటి

  • జగన్ గతంలోనూ తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు 
  • జగన్ చేస్తోన్న పాదయాత్రకు స్పందన కరవైనందుకే రాజీనామాల డ్రామా
  • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు రాజీపడరు

ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం త‌మ పార్టీ లోక్‌సభ సభ్యులతో రాజీనామా చేయిస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా ఏలూరులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... జగన్ చేస్తోన్న పాదయాత్రకు స్పందన కరవైందని, అందుకే రాజీనామాల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.

తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ చాలా సార్లు చెప్పారని, ఇప్పటివరకు చేయలేదని ప్రత్తిపాటి విమర్శించారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాపై అస్సలు మాట్లాడడం లేదని, ఆయన మోదీతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని చెప్పిన చంద్రబాబు నాయుడు మార్చి 5 వరకు డెడ్ లైన్ పెట్టారని, ఆయన ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. 

More Telugu News