Chandrababu: మా నిర్ణయం టీడీపీకి మింగుడుపడటం లేదు..పారిపోయిన చరిత్ర మీది: అంబటి రాంబాబు

  • పారిపోయిన చరిత్ర టీడీపీది
  • ప్రజల కోసం త్యాగాలు చేస్తున్న చరిత్ర మాది
  • రాష్ట్రాన్ని నట్టేట ముంచింది చంద్రబాబు కాదా?

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించడాన్ని చాలా మంది ప్రజలు స్వాగతించారని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. తమ నిర్ణయం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము తీసుకున్న నిర్ణయాన్ని కూడా టీడీపీ నేతలు తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారని... వారి వైఖరి తనను ఎంతో బాధిస్తోందని తెలిపారు. ఇంకా ఏడాది కాలం ఉన్నా... తమ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని స్వాగతించకుండా... విమర్శించడం చాలా దారుణమని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా 10 రోజుల క్రితం రాజీనామాలు చేయమని కోరితే... పారిపోయిన చరిత్ర టీడీపీదని ఆయన ఎద్దేవా చేశారు. పదవులను పట్టుకుని వేలాడుతున్న మీరా డ్రామాలు ఆడుతోంది? ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నా మేమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు బయట టీడీపీ ఎంపీలు డ్రామాలు చేశారని... ఒక్కసారి వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని చెప్పారు. ప్యాకేజీ పేరుతో రాష్ట్రాన్ని నట్టేట ముంచింది ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ప్యాకేజీ అరుంధతి నక్షత్రం అయితే... హోదా సంజీవని లాంటిదని చెప్పారు. 

More Telugu News