Rohit Sharma: సెంచరీ కొట్టినా నెటిజన్ల నుంచి తిట్లు తింటున్న రోహిత్ శర్మ!

  • సమన్వయ లోపంతో రెండు రనౌట్లు
  • రోహిత్ వల్లే అంటూ మండిపడుతున్న నెటిజన్లు
  • యోయో టెస్టు ఎలా పాసయ్యావంటూ నిలదీత

దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన ఐదో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. రోహిత్ సెంచరీపై క్రికెట్ అభిమానులు ఆనందంగా ఉన్నప్పటికీ, నెటిజన్ల ఆగ్రహానికి మాత్రం అతను గురయ్యాడు. పరుగులు సాధించే క్రమంలో సమన్వయ లోపంతో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు రనౌట్ అయ్యారు. మోర్కెల్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడిన రోహిత్ శర్మ... సింగిల్ కోసం ముందుకు వచ్చే ప్రయత్నం చేసి, వెంటనే ఆగిపోయాడు.

దీంతో, నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న కోహ్లీ సగం పిచ్ దాటి వచ్చేశాడు. వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే డుమిని విసిరిన త్రో వికెట్లను తాకింది. కాసేపటికి రహానే కూడా ఇదే తరహాలో ఔటయ్యాడు. దీంతో, రోహిత్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు రనౌట్లకు కారణమైన నీవు యోయో టెస్టు ఎలా పాసయ్యావో అర్థం కావడం లేదంటూ మండిపడుతున్నారు. ఇంకా ఎంత మందిని రనౌట్ చేస్తావయ్యా? అంటూ నిలదీస్తున్నారు. మరికొందరేమో రోహిత్ ఓ స్వార్థపరుడు అంటూ విమర్శించారు. 

More Telugu News