Harley Davidson: లగ్జరీ బైక్ ప్రియులకు శుభవార్త.. ధరలు గణనీయంగా తగ్గనున్నాయ్‌!

  • లగ్జరీ బైక్‌లపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం
  • కస్టమ్స్ డ్యూటీ 50 శాతానికి పరిమితం
  • పూర్తిగా విదేశాల్లో అసెంబుల్ అయిన వాటికి మాత్రమే వర్తింపు

బైక్ ప్రియులకు ఇది శుభవార్తే. లగ్జరీ బైక్‌లపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల హార్లే డేవిడ్‌సన్, ట్రయంప్ వంటి లగ్జరీ బైక్‌ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటి వరకు 800 సీసీ సామర్థ్యం గల బైక్‌లపై 60 శాతం, 800 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బైక్‌లపై 75 శాతం దిగుమతి సుంకాన్ని విధించేవారు. ఇప్పుడీ సుంకం 50 శాతానికి అంటే సగానికి సగం తగ్గింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) పేర్కొంది. అయితే ఇక్కడో చిన్న నిబంధన కూడా ఉంది. పూర్తిగా విదేశాల్లోనే అసెంబుల్ అయిన బైక్‌లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

నిజానికి హైఎండ్ బైక్‌లు భారత్‌లో ఉత్పత్తి కావడం లేదు. విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటుండడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో వీటిపై ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. స్పందించిన ప్రభుత్వం తాజాగా దిగుమతి సుంకాన్ని 50 శాతానికి పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. సుంకం సగానికి సగం తగ్గిపోవడంతో బైక్ ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.

More Telugu News