jc divakar reddy: ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారట.. జగన్ ఎంతటి తెలివైనవాడు!: జేసీ దివాకర్ రెడ్డి

  • ఏప్రిల్ 6న రాజీనామా పంపితే అది అంగీకారం పొందడానికి కనీసం రెండు నెలలు పడుతుంది
  • ఆపై కొన్ని నెలలకే జమిలి ఎన్నికలు వస్తాయి
  • మళ్లీ ఎన్నికలు ఎందుకని ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపదు
  • నవంబర్ లేక డిసెంబరు వరకు ఆగి జమిలి ఎన్నికలప్పుడే పెడుతుంది

ప్రత్యేక హోదా కోసం పోరాడ‌తామ‌ని, ఏప్రిల్‌ 6న త‌మ లోక్ స‌భ స‌భ్యులు రాజీనామా చేస్తార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ తీరుపై స్పందించిన టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి.. జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 'ఏప్రిల్ 6న రాజీనామా చేస్తార‌ట‌, జ‌గ‌న్ కి ఎంత‌టి తెలివి తేట‌లు చూడండి!' అంటూ వ్యంగ్యంగా అన్నారు.

'ఎప్పుడో ఏప్రిల్ 6వ తారీఖు చేస్తారట.. జగన్ బాగా తెలివైనవాడు.. ఏప్రిల్ ఆరున రాజీనామాలు పంపితే వాటి అంగీకారానికి కనీసం రెండు నెలలు పడుతుంది. ఆపై కొన్ని నెల‌ల‌కే  జమిలి ఎన్నికలు వస్తాయి. నవంబర్ లేక డిసెంబరులో ఈ జ‌మిలి ఎన్నికలు వస్తాయి.. ఏపీ లోక్ స‌భ‌కి మళ్లీ ఎన్నికలు ఎందుకని ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపదు. నవంబర్ లేక డిసెంబరు వరకు ఆగుతుంది' అని అన్నారు.

మరోవైపు, రెండు సంవత్సరాల క్రితం కూడా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని జ‌గ‌న్ చెప్పారని గుర్తు చేశారు. జ‌గ‌న్‌ ఈ రోజు ఓ మాట చెబుతారని, కొన్ని రోజుల తరువాత మరో మాట చెబుతారని, ఆయన మాటలను ఎవ్వరూ నమ్మరని అన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలనుకుంటే ఈ రోజే రాజీనామా చేయొచ్చుకదా? అని ప్రశ్నించారు.

More Telugu News