Srinagar: సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడి... 24 గంటలు దాటినా ఉగ్రవాదులను మట్టుబెట్టలేకపోతున్న సైన్యం!

  • నిన్న క్యాంపులో చొరబడిన ఉగ్రవాదులు
  • వారి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు
  • కొనసాగుతున్న ఎన్ కౌంటర్

శ్రీనగర్ శివార్లలోని కరన్ నగర్ లో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో సైన్యం ఇంకా విజయం సాధించలేదు. ఎన్ కౌంటర్ ప్రారంభమై 24 గంటలు గడుస్తుండగా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, కాశ్మీర్ పోలీసులు కలసి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇంకా ముగియలేదు. కనీసం ఇద్దరు ఉగ్రవాదులు ఇప్పటికీ ఓ నిర్మాణంలో ఉన్న భవంతిలో దాక్కున్నారని సైన్యాధికారి ఒకరు వెల్లడించారు.

 సోమవారం నాడు ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ క్యాంపులోకి చొరబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారిని నిలువరించేందుకు ఓ జవాను కాల్పులు జరిపి గాయపడ్డాడు. టెర్రరిస్టుల వద్ద ఏకే-47తో పాటు ఆయుధాలు కూడా ఉన్నట్టు తెలుస్తుండగా, వారు దాగున్న భవంతి చుట్టూ భారీ ఎత్తున పోలీసులు, సైన్యం మోహరించారు. అప్పుడప్పుడూ కాల్పుల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్ కౌంటర్ ను సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు.

More Telugu News