helmet: ఆ ఆలయంలో 'నో హెల్మెట్‌-నో పూజ' బోర్డులు

  • ఒడిశాలోని మా సరళా దేవి ఆలయంలో ద్విచక్రవాహనదారులకు రూల్స్ 
  • అక్కడ ద్విచక్రవాహనాలకు పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం 
  • రూల్స్ వల్ల వాహనదారులు హెల్మెట్‌ కొనుక్కోవడంపై ఆసక్తి

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన మా సరళా దేవి ఆలయంలో ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు పూజ చేయించుకోవాలంటే హెల్మెట్ పెట్టుకుని వెళ్లాల్సిందే. లేదంటే సదరు బండి పూజకు నోచుకోదు. ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో 'నో హెల్మెట్‌-నో పూజ' అనే బోర్డులు కూడా పెట్టేశారు. తమ ఆలయంలో కొత్త ద్విచక్రవాహనాలకు పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారని అక్కడి పూజారులు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల వాహనదారులకు హెల్మెట్‌ కొనుక్కోవడంపై ఆసక్తి పెరుగుతోందని చెప్పారు. హెల్మెట్ పెట్టుకోకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది మృత్యువాత పడుతున్నారని, అందుకే తాము ఇలా చేస్తున్నామని చెప్పారు.

More Telugu News