Hyderabad: మహిళ మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు... మరిదే వదినను కడతేర్చాడు!

  • ఈ నెల 29న కొండాపూర్ బొటానికల్ గార్డెన్ దగ్గర లభ్యమైన మహిళ మృతదేహం
  • తల్లి, తమ్ముడితో ప్లాన్ వేసిన భర్త
  • అమలు చేసిన మరిది

రెండు వారాల క్రితం కొండాపూర్ బొటానికల్‌ గార్డెన్‌ వద్ద గోనె సంచుల్లో లభించిన మహిళ మృతదేహానికి సంబంధించిన కేసును సైబరాబాద్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హతురాలి కుటుంబ సభ్యులే ఆమెను చంపి ఎనిమిది ముక్కలుగా చేసి గోనె సంచుల్లో మూటలుకట్టి బొటానికల్‌ గార్డెన్‌ వద్ద పడేసినట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... గత నెల 29న కొండాపూర్‌ లోని బొటానికల్ గార్డెన్ ప్రాంతంలో భరించలేని దుర్గంధం వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దుర్వాసన రెండు గోనెసంచుల్లోంచి వస్తోందని గుర్తించి, వాటిని తెరవగా, అందులో ఖండఖండాలుగా మారిన ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. దొరికిన క్లూలతో ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కొండాపూర్ లోని ఒక బార్‌ లో పనిచేసే అమర్‌ కాంత్‌ జా తన తల్లి, అన్నతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు. హత్యకు పథకం వేసిన అనంతరం అమర్‌ కాంత్‌ అన్న (హతురాలి భర్త) తన కొడుకును తీసుకుని వెళ్లిపోగా... తల్లితో కలిసి అమర్‌ కాంత్‌ వదినను అంతమొందించాడు. అనంతరం మృతదేహాన్ని ఎనిమిది ముక్కలుగా కోసి గత నెల 29న బొటానికల్ గార్డెన్‌ వద్ద పడేశాడు. దీంతో ఈ కేసులో అమర్‌ కాంత్‌ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న అమర్ కాంత్, అతని అన్నను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

More Telugu News