Ranga Reddy District: తెలంగాణ టీ20 లీగ్ రెండోరోజు: రంగారెడ్డి జట్టు తరఫున క్రికెట్ ఆడుతోన్న సినీనటుడు అఖిల్

  • సిద్ధిపేట మినీ స్టేడియంలో తెలంగాణ టీ20 లీగ్
  • నిజామాబాద్ జట్టుతో తలపడుతోన్న రంగారెడ్డి జట్టు
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నిజామాబాద్ జట్టు

సిద్ధిపేటలో నిన్న తెలంగాణ టీ20 లీగ్ మ్యాచ్ లు ప్రారంభమైన విషయం తెలిసిందే. సిద్ధిపేట మినీ స్టేడియంలో నిన్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు టాస్ వేసి మొదటి ఆటను ప్రారంభించారు. రెండో రోజు అయిన ఈ రోజు నిజామాబాద్ జట్టుతో రంగారెడ్డి జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన నిజామాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. రంగారెడ్డి జిల్లా తరఫున సినీనటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో పది ఉమ్మడి జిల్లాల క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి.

ఈ టోర్నీలో మొత్తం 49 మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 40 లక్షలు. విజేతకు రూ. 15 లక్షలు, రన్నరప్‌కు రూ. 7.5 లక్షలు ఇవ్వనున్నారు. అలాగే, మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.5 లక్షలు బహుమతిగా లభిస్తాయి. ఈ లీగ్‌లో కాకతీయ కింగ్స్, నిజామాబాద్, మెదక్‌ మావెరిక్స్, ఖమ్మం టైరా, కరీంనగర్‌ వారియర్స్, నల్లగొండ లయన్స్, ఆదిలాబాద్‌ టైగర్స్, మహబూబ్‌నగర్‌ ఎంఎల్‌ఆర్‌ రాయల్స్, రంగారెడ్డి, హైదరాబాద్ జట్లు పాల్గొంటున్నాయి.

More Telugu News