indra nooyi: క్రికెట్ ను ఎంతో ప్రేమించే ఇంద్రానూయీకి అరుదైన గౌరవం!

  • ప్రముఖ వ్యాపారవేత్త, పెప్సీకో ఛైర్మన్ ఇంద్రానూయీ
  • కాలేజ్ రోజుల్లో క్రికెట్ ఆడిన ఇంద్రా
  • ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియామకం పట్ల ఇంద్రా ఆనందం
  • క్రికెట్ ఉన్నతి కోసం పనిచేస్తానంటూ వ్యాఖ్య

ప్రముఖ వ్యాపారవేత్త, పెప్సీకో ఛైర్మన్ ఇంద్రానూయికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఆమె నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె నియామకాన్ని నిన్న జరిగిన ఐసీసీ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. జూన్ నెలలో ఆమె పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు.

గత ఏడాది జరిగిన సమావేశంలో పాలనకు సంబంధించి సమూల మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బోర్డ్ డైరెక్టర్ల సంఖ్యను 17కు పెంచింది. ఇందులో ఛైర్మన్ తో పాటు 12 మంది ఫుల్ మెంబర్లు కాగా, ముగ్గురు అసోసియేట్ డైరెక్టర్లు,మరొక ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండాలని నిర్ణయించారు. 2017 నవంబర్ లో రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ను ప్రారంభించారు. ఈ క్రమంలో, ఇండిపెండెంట్ డైరెక్టర్ గా చివరకు ఇంద్రా నూయీని ఐసీసీ నియమించింది.

తన నియామకం పట్ట ఇంద్రా నూయీ ఆనందం వ్యక్తం చేశారు. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని ఆమె తెలిపారు. టీనేజర్ గా ఉన్నప్పుడు కాలేజ్ లో క్రికెట్ ఆడేదాన్నని చెప్పారు. క్రికెట్ వల్లే తాను టీమ్ వర్క్, రెస్పెక్ట్, ఆరోగ్యకరమైన పోటీ తదితర అంశాలను నేర్చుకోగలిగానని అన్నారు. ఐసీసీ బోర్డు సభ్యులతో కలసి క్రికెట్ ఉన్నతి కోసం తాను కృషి చేస్తానని చెప్పారు.

ఇంద్రా నూయీ నియామకం పట్ల ఐసీసీ స్పందిస్తూ, ఐసీసీలోకి ఆమెను సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపింది. డైరెక్టర్స్ బోర్డులోకి ఇండిపెండెంట్ డైరెక్టర్ ను... అందులోనూ ఓ మహిళను తీసుకోవడం మంచి పరిణామమని చెప్పింది. ప్రపంచంలోని స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్లో ఒకరైన ఇంద్రా నూయీ సేవలు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ను మరింత మెరుగైన స్థితికి తీసుకెళతాయని తెలిపింది.

More Telugu News