Mohan Babu: 'గాయత్రి'లో పేలిన పొలిటికల్ పంచ్ లు... ప్రత్యేక హోదాపై డైలాగ్ మాత్రం 'బీప్'!

  • నేడు విడుదలైన మోహన్ బాబు 'గాయత్రి'
  • పటేల్ పాత్రలో మోహన్ బాబు అద్భుత నటన
  • విజిల్స్ వేయించేలా డైలాగులు

నేడు వెండితెరలను తాకిన మోహన్ బాబు కొత్త చిత్రం 'గాయత్రి'పై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. గాయత్రి పటేల్ గా మోహన్ బాబు అద్భుతమైన నటనను ప్రదర్శించారని, దాసరి శివాజీ అనే స్టేజ్ ఆర్టిస్టుగానూ అలరించాడని అభిమానులు అంటున్నారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే కథలో వినోదం వంటి కమర్షియల్ అంశాలన్నీ జోడించి తీశారని సినీ విశ్లేషకులు కితాబిస్తున్నారు.

చిత్రంలో సమకాలీన రాజకీయాలపై మోహన్ బాబు నోటి నుంచి పలికించిన పొలిటికల్ డైలాగులు, రాజకీయ నాయకులపై వేసిన సెటైర్లు ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించేలా ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేక హోదాపై కూడా ఓ డైలాగ్ ఉందని, అయితే, ఆ డైలాగ్ ను సెన్సార్ ఆదేశాల మేరకు మ్యూట్ చేశారని చిత్రం చూసిన అభిమానులు వెల్లడిస్తున్నారు. మొత్తం మీద సినిమాకు పాజిటివ్ స్పందన వస్తుండటంతో మంచు ఫ్యామిలీ ఖుషీగా ఉందట.

More Telugu News