Harish Rao: అలాంటి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోండి.. క్రిమినల్ కేసులు నమోదు చేయండి: మంత్రి హరీశ్ రావు

  •  అసలు రైతులే లబ్ది పొందాలి
  •  జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  •  మార్కెట్ యార్డులలోనే కొనుగోలు కేంద్రాలు
  •  మార్కెట్ లో ధర తగ్గగానే కొనుగోలుకేంద్రాలు తెరవాలి

రైతుల ముసుగులో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. న‌కిలీ రైతుల పట్ల జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ఘటనలపై ఆయా జిల్లా కలెక్టర్లు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను ఇకపై వ్యవసాయ మార్కెట్ యార్డులలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ రోజు హైద‌రాబాద్ లోని తెలంగాణ‌ సేక్రేటేరియట్ లో మార్కెటింగ్ కార్యకలాపాలు, కందులు, శన‌గ‌లు, వేరు శనగ వంటి పంట కొనుగోలు కేంద్రాల అమలు తీరు, ఏర్పాట్ల‌పై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్ రావు ఆ జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. బహిరంగ మార్కెట్ లో ధరలు తగ్గిన వెంటనే శన‌గ‌లు, వేరుశనగ కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని మంత్రి సూచించారు.

మార్కెట్ యార్డుల వెలుపల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయొద్దని హరీశ్‌ రావు అన్నారు. ప్రస్తుతం కందుల కొనుగోలు కోసం ఇప్పటికే నడుస్తోన్న సొసైటీల కొనుగోలు కేంద్రాలను సమీపంలోని మార్కెట్ కమిటీతో వెంటనే అనుసంధానించాలని మంత్రి కోరారు. అదేవిధంగా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులతో ధ్రువీకరణ ప‌త్రం పొందిన రైతుల వద్ద నుంచి మాత్రమే ప్రభుత్వ కొనుగోళ్లు జరిగే విధంగా చూడాల్సిందిగా ఆదేశించారు. ఆ ప‌త్రాల‌పై కూడా నిఘా పెట్టి పారదర్శకతతో గుర్తింపు ఇచ్చేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులకు జిల్లా కలెక్టర్లు తగు ఆదేశాలు జారీ చేయాలన్నారు.

వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ కు తేకముందే నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు జరిగిన కందుల కొనుగోళ్లను హరీశ్ రావు సమీక్షించారు. కందుల సేకరణ సందర్భంగా కొన్ని చోట్ల, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని మంత్రి తెలిపారు. ఆయా ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ఆదేశించారు. జిల్లా స్థాయిలో ప్ర‌త్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి మార్కెటు కమిటీలలో జరిగే క్రయవిక్రయాలపై నిఘా ఉంచాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

25 క్వింటాళ్ళ కు మించి అదనంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చిన వ్యక్తులపై నిఘా పెట్టాలని కోరారు. వారు ఎంత విస్తీర్ణంలో పండించారో సరాసరి తనిఖీ చేయాలని ఆదేశించారు. వ్యయసాయ శాఖ స్థానిక ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి రైతులు దృవీకరణ పత్రం పొందాలని హరీశ్ రావు సూచించారు. కొనుగోలు, చెల్లింపుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు, ఏ రోజు కారోజు ఆన్ లైన్లో  అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో పంటల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేటట్టు చూడాలని అన్నారు.

ఏది ఏమైనా రైతులకు మద్ధతు ధర కల్పించే విషయమై పూర్తిస్థాయి చర్యలు తీసుకొని వారి ముసుగులో ప్రభుత్వానికి నష్టం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించి, నిజమైన రైతులకు లబ్ది చేకూర్చాలని హరీశ్ రావు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సు లో మార్కెటింగ్ కార్యదర్శి పార్ధసారధి, వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ జగన్ మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు తదితర అధికారులు పాల్గొన్నారు.

More Telugu News