Guntur District: తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత!

  • వివాహేతర సంబంధం కారణంగా వేధింపులకు దిగుతున్న భర్తపై ఫిర్యాదు
  • కౌన్సిలింగ్ సమయంలో భార్య వద్దు ప్రియురాలే ముద్దు అనడంతో మనస్తాపం
  • నేరుగా రోడ్డు మీదకు వెళ్లి లారీ కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ

గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో భర్త తిరస్కారానికి గురైన మహిళ నేరుగా రోడ్డుపైకి వచ్చి లారీ కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... తాడేపల్లి సమీపంలోని మహానాడు ప్రానతంలో నివాసం ఉండే కరీముల్లాకు నసీమా అనే యువతితో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు అబ్బాయిలున్నారు. ఇదిలా వుండగా, విజయవాడకు చెందిన యువతి మహానాడు ప్రాంతంలో నివాసముండేందుకు వచ్చింది. ఆమెతో కరీముల్లాకు పరిచయమై, వివాహేతర సంబంధంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న నసీమా పెద్దలను ఆశ్రయించింది. వారెన్నిసార్లు చెప్పినా కరీముల్లా ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పరాయి స్త్రీ మోజులో పడిన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, వారి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు వేధింపులకు దిగుతున్నాడని పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో కరీముల్లాకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు పిలవగా, తనకు భార్య వద్దని, ప్రియురాలే ముద్దని తెలిపాడు. అంతేకాకుండా పోలీసుల ముందు చులకనగా మాట్లాడాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పరుగెత్తుకుని రోడ్డుమీదకు వచ్చి అటుగా వెళ్తున్న లారీకిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది. వేగంగా స్పందించిన పోలీసులు ఆమెను కాపాడి, గుంటూరు ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్ కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. 

More Telugu News