anasuya: తమ ఫోన్ ను నేలకేసి కొట్టి దుర్భాషలాడిందంటూ.. యాంకర్ అనసూయపై మహిళ ఫిర్యాదు!

  • సెల్ఫీ దిగాలనుకున్న బాలుడు
  • ఫోన్ లాక్కుని పగలగొట్టిన అనసూయ
  • తల్లీకొడుకులపై దుర్భాషలు

యాంకర్, టాలీవుడ్ నటి అనసూయపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఫోన్ ను పగలగొట్టడమే కాక, తమపై దుర్భాషలాడిందని ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే, ఒక పని నిమిత్తం హైదరాబాదులోని తార్నాక ప్రాంతానికి అనసూయ వెళ్లింది. అదే సమయంలో తన తల్లితో పాటు ఓ బాలుడు అటుగా వెళ్తున్నాడు. అనసూయ కనిపించగానే ఆమె వద్దకు వెళ్లి, అభిమానంతో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు.

తమ మొబైల్ ద్వారా ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించగా... ఇది గమనించిన అనసూయ ఆగ్రహంతో బాలుడి చేతిలోని ఫోన్ ను లాక్కుని, నేలకేసి కొట్టింది. జరిగిన ఘటనతో తల్లీకుమారులు ఇద్దరూ బిత్తరపోయారు. ఫోన్ ఎందుకు పగలగొట్టావని బాలుడి తల్లి ప్రశ్నించగా... సమాధానం చెప్పకుండానే, వారిని దుర్భాషలాడుతూ అనసూయ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమను చాలా గలీజు మాటలతో తిట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. 

More Telugu News