India: పాక్ సైనికుల చేతుల్లో దుర్మరణానికి ముందు జవాను పోస్టు చేసిన కవిత... రగిలిపోతున్న చదివిన వారి హృదయాలు!

  • ఆదివారం తెల్లవారుజామున పాక్ సైనికుల చేతుల్లో వీరమరణం
  • మరో ముగ్గురు జవాన్లు కూడా
  • మరణించే ముందు ఫేస్ బుక్ లో కవిత రాసిన కపిల్ కుందు
  • మరో సర్జికల్ దాడి చేయాలని నెటిజన్ల డిమాండ్

ఆదివారం రాత్రి పాకిస్థాన్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, విచక్షణారహితంగా సరిహద్దుల్లో కాపలాగా ఉన్న జవాన్లపై కాల్పులు జరపగా, ఆ దాడిలో వీర మరణం పొందిన కెప్టెన్ కపిల్ కుందు తన ఫేస్ బుక్ ఖాతాలో చివరిసారిగా పెట్టిన ఓ పోస్టు, ఇప్పుడు వైరల్ అవుతూ, పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహం పెల్లుబికేట్లు చేస్తోంది.

కపిల్ కుందు తన ఫేస్ బుక్ పోస్టులో 'ఎన్నేళ్ళు బతికామన్నది కాదు.. ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం' అంటూ బయోలో రాసుకున్నారు. ఆయన మరణం తరువాత ఈ మాటలను చూసిన వారు పాక్ పై రగిలిపోతున్నారు. వెంటనే పాకిస్థాన్ పై మరోసారి లక్ష్యిత దాడులు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. వీర సైనికుడి త్యాగాన్ని వృథాపోనివ్వమని తమలోని దేశభక్తిని చాటుతూ పోస్టులు పెడుతున్నారు.

కాగా, ఆదివారం రాత్రి ఒంటిగంటకు కూడా తన కుమారుడితో మాట్లాడిన కపిల్, తెల్లారేసరికి దుర్మరణం పాలయ్యారు. పాకిస్థాన్ ఒక మోర్టార్ ను పేల్చగా, అది సరిహద్దుల్లో కపిల్ తో పాటు రామావతార్, శుభమ్ సింగ్, రోషన్ లు ఉన్న బంకర్ ను తాకింది. ఈ నెల 10న తన 23వ పుట్టిన రోజును జరుపుకునేందుకు సెలవు కూడా పెట్టిన ఆయన, అంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోవడం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నూ కలచి వేసింది. ఈ మరణాలకు సైన్యం ప్రతీకారం తీర్చుకోవాలని కోరారు. మరో సర్జికల్ దాడి చేయాలని భారత ప్రజలు కోరుతున్నారని, ఏం చేయాలో మీరే నిర్ణయించుకోవాలని ఆయన సైన్యానికి సూచించడం గమనార్హం.

More Telugu News