drinking habit: తండ్రి వ్యసనాన్ని మాన్పించాలనుకుంది.. చివరకు ప్రాణాలు కోల్పోయింది!

  • తాగుడుకు బానిస అయిన తండ్రిని మార్చాలనుకుంది
  • ఎలుకల మందు తిని బెదిరించాలనుకుంది
  • కానీ, జరగకూడనిది జరిగిపోయింది

తండ్రికి ఉన్న తాగుడు వ్యసనాన్ని మాన్పించాలనుకున్న కూతురు... చివరకు తన ప్రాణాలనే కోల్పోయిన విషాదకర ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, తిరుపతి రూరల్ మండలం రజక కాలనీకి చెందిన సరస్వతి, శ్రీనివాస్ ల కుమార్తె భార్గవి. స్విమ్స్ ఆసుపత్రిలో సరస్వతి స్వీపర్ గా పని చేస్తుండగా, శ్రీనివాస్ ఫొటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.

తాగుడుకు బానిస అయిన శ్రీనివాస్... భార్యతో తరచుగా గొడవ పడేవాడు. ఈ క్రమంలో మద్యంపై భార్గవి ద్వేషం పెంచుకుంది. మందు తాగడం మానాలని తండ్రికి పదేపదే చెప్పేది. ఈ సమస్యపై పోరాడుతున్న 'ఐద్వా' మహిళా సంఘంలో కూడా భాగస్వామి అయి... ఖాళీ రోజుల్లో, సెలవుల్లో రాష్ట్రమంతా తిరిగి ప్రదర్శనలు ఇచ్చేది. అయితే, తన తండ్రికి ఉన్న వ్యసనాన్ని మాత్రం మాన్పించలేకపోయింది.

ఈ నేపథ్యంలో, తాగుడు మానేస్తావా, లేక ఎలుకల మందు తిని చావమంటావా? అంటూ మందు చూపిస్తూ తండ్రిని నిలదీసింది. ఆమె తల్లి వచ్చి, చేతిలోని ఎలుకల మందును కిందకు పడేసింది. అప్పటికే బెదిరింపులో భాగంగా భార్గవి కొంచెం మందును నోట్లో వేసుకుంది. మందు ప్రభావంతో తాను కొంచెం స్పృహ తప్పుతానని, భయంతో తన తండ్రి తాగుడు మానేస్తాడని ఆమె భావించింది. అయితే, ఆమె కొంచెం మందును తిన్న విషయాన్ని ఎవరికీ వెంటనే చెప్పలేదు. దీంతో, వారు సకాలంలో స్పందించలేకపోయారు. ఈ క్రమంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. స్విమ్స్ ఆసుపత్రిలో మూడు రోజులపాటు చికిత్స అందించినా, లాభం లేకపోయింది. చివరకు ప్రాణాలను కోల్పోయింది. 

More Telugu News