Bangladesh: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్!

  • ఒక్క బై కానీ, లెగ్ బై కానీ లేకుండా 513 పరుగులు
  • 494 పరుగులతో ఆసీస్ పేరుపై ఉన్న రికార్డు బద్దలు
  • శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఘటన

చిట్టగాంగ్‌లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 513 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్‌కు టెస్టుల్లో ఇది ఐదో అత్యధిక స్కోరు. అంతేకాదు.. ఒక బై కానీ, లెగ్‌ బై కానీ లేకుండా 513 పరుగులు చేయడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరు మీద ఉండేది. 2014లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది. ఈ మొత్తం  స్కోరులో బై ద్వారా గానీ, లెగ్ బై ద్వారా కానీ ఒక్క పరుగు కూడా రాలేదు. మూడేళ్ల తర్వాత ఇప్పుడా రికార్డును బంగ్లాదేశ్ తుడిచిపెట్టేసింది.

ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 513 పరుగులకు ఆలౌట్ అయింది. మొమినుల్ హక్ 176 పరుగులు చేయగా, ముష్ఫికర్ రహీం 92 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 83, ధనంజయ డి సిల్వా 104 పరుగులతో క్రీజులో ఉన్నారు.

More Telugu News