actress sanusha: ట్రైన్ లో వేధింపులకు దిగిన పోకిరిని అరెస్టు చేయించిన 'జీనియస్' హీరోయిన్!

  • తమిళనాడు నుంచి ట్రైన్ లో కేరళ వెళ్తున్న నటి సనూష
  • వేధింపులకు దిగిన వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేయించిన వైనం
  • నిందితుడ్ని నిలదీసినప్పుడు సపోర్ట్ రాలేదని ఆవేదన

ట్రైన్ లో తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీని మలయాళ నటి సనూష అరెస్టు చేయించింది. ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నటించిన ‘బంగారం’ సినిమాలో హీరోయిన్ మీరా చోప్రా చెల్లెలి పాత్రలో సనూష నటించిన సంగతి చాలా మందికి గుర్తుండే వుంటుంది. అలాగే, ఆమధ్య వచ్చిన ‘జీనియస్’ సినిమాలో హీరోయిన్‌ గా కూడా నటించింది. ఇక ఘటనపై ఆమె చెప్పిన వివరాల్లోకి వెళ్తే.. "నేను ట్రైన్ లో చెన్నై నుంచి కేరళ వెళ్తున్న క్రమంలో బెర్త్ పై పడుకున్నాను. ఆ సమయంలో తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని గుర్తించాను.

వెంటనే అతని చేయిపట్టుకుని లైట్స్ ఆన్ చేసి ట్రైన్ లో ఎస్కార్ట్ పోలీసులకు అప్పగించాను. అయితే నాతో అతను అసభ్యకరంగా ప్రవర్తించిన దాని కంటే కూడా పక్కనున్న మరో ఇద్దరు ఏమాత్రం రియాక్ట్ కాకపోవడం చాలా ఆందోళనకు గురిచేసింది. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్లే వరకు నేను అక్కడే నిలబడి ఉన్నాను. ఇప్పుడు నేను చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్లవలసి ఉంటుందని తెలుసు. ఈ విషయంలో నా కుటుంబం పూర్తి మద్దతునిచ్చినందుకు సంతోషిస్తున్నాను.

ఈ సందర్భంగా నేను మహిళలకు, అమ్మాయిలకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇటువంటి విషయాలు ఏవైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వండి. ఆలస్యం చేయవద్దు" అని తెలిపింది. బాలనటిగా సుమారు 40 సినిమాల్లో నటించిన సనూష, పలు టీవీ సీరియల్స్‌ లో కూడా నటించింది.  

More Telugu News