Machilipatnam: అమెరికాలో బందరు యువకుడి అనుమానాస్పద మృతి!

  • మియామీ బీచ్‌లో కనిపించిన యువకుడి మృతదేహం
  • విషయం తెలిసి విలపిస్తున్న కుటుంబ సభ్యులు
  • యువకుడి మృతిపై అనుమానాలు

అమెరికాలోని ఫ్లోరిడాలో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన యువకుడు బొమ్మాల చైతన్య కుమార్ (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో యువకుడి మృతదేహం లభ్యమైంది. ఫ్లోరిడాలోనే ఉంటున్న గుడివాడకు చెందిన తమ కుమారుడి స్నేహితుడి ద్వారా తమకీ వార్త తెలిసినట్టు చైతన్య కుమార్ కుటుంబ సభ్యులు తెలిపారు.  

చైతన్య కుమార్ ఇటీవలే ఎంఎస్ పూర్తి చేశాడని, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ వార్త తెలిసిందని విలపించారు. డిసెంబరు 2016లో చివరిసారి బందరు వచ్చిన చైతన్య ప్రసాద్ మార్చి 2017లో తిరిగి ఫ్లోరిడా వెళ్లాడు. ఇక్కడి స్నేహితులతో అతడు నిత్యం టచ్‌లో ఉండేవాడని, అయితే గతవారం రోజులుగా వీడియో కాల్స్‌కు స్పందించడం లేదని చైతన్య బాల్యస్నేహతుడు చెప్పారు. అతడి మరణం వెనక ఏదో మిస్టరీ ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

చైతన్య తండ్రి రామ మోహన్ రావు మచిలీపట్నం మునిసిపల్ కార్యాలయ ఉద్యోగి.  చైతన్య మృతదేహాన్ని తెప్పించేందుకు చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు.

More Telugu News