passport: ఆరెంజ్ కలర్ పాస్‌పోర్టు విషయంలో వెనక్కి తగ్గిన మోదీ ప్రభుత్వం!

  • ఈఆర్‌సీ కావాలనుకునే వారికి ఆరెంజ్ రంగు పాస్‌పోర్టులు జారీ చేయాలని భావించిన విదేశాంగ శాఖ
  • ప్రతిపక్షాల విమర్శలతో వెనక్కి తగ్గిన కేంద్రం
  • కొనసాగనున్న నీలి రంగు పాస్‌పోర్టులు

ఆరెంజ్ కలర్ పాస్‌పోర్టు విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకుంది. ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) కావాలనుకునే వారికి ఆరెంజ్ రంగులో ఉండే పాస్‌పోర్టు జారీ చేయాలని మోదీ ప్రభుత్వం భావించింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న నీలిరంగు పాస్‌పోర్టునే కొనసాగించాలని కేంద్రం నిర్ణయానికి వచ్చింది. అలాగే పాస్‌పోర్టు చివరి పేజీలోని పేరు, వ్యక్తిగత వివరాలు అలానే ఉండనున్నాయి. వీటిని అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు.

పాస్‌పోర్టు చివరి పేజీలో ఉండే చిరునామా, ఇతర వివరాలను తొలగించాలంటూ భారత విదేశాంగ శాఖ ఇటీవల నిర్ణయించింది. ఇమిగ్రేషన్ చెక్ కావాలనుకునే వారికి ఆరెంజ్ రంగు అట్టతో ఉండే పాస్‌పోర్టు జారీ చేయాలని యోచించింది. ఇమిగ్రేషన్ చెక్ అవసరం లేని వారికి మాత్రం ప్రస్తుతం ఉన్న నీలిరంగు పాస్‌పోర్టునే కొనసాగించాలని నిర్ణయించింది. ఆరెంజ్ రంగు పాస్‌పోర్టు విధానాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. పాస్‌పోర్టు రంగు మార్చడం ద్వారా బీజేపీ వివక్షకు తెరలేపిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైరయ్యారు. విదేశాలకు వెళ్లే కార్మికులను రెండో తరగతి ప్రయాణికుల్లా చూస్తున్నారని విమర్శించారు. ఆరెంజ్ కలర్ పాస్‌పోర్టులపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

More Telugu News