Tollywood: అప్పుడు, నా భార్యతో ఆ ఛాలెంజ్ చేసి మద్రాసు వెళ్లాను: పరుచూరి గోపాలకృష్ణ

  • సినీ రచయితగా ఎదిగే క్రమంలో పరుచూరి జ్ఞాపకం
  • నా ఉద్యోగానికి ఏడాది సెలవు పెట్టా
  • ‘మద్రాసు వెళ్లడం అవసరమా?  
  • అవకాశాలు రాకపోతే..నేను, ముగ్గురు పిల్లలు ఎలా బతకాలి? అని నా భార్య ప్రశ్నించింది: పరుచూరి

తాను సినిమా రచయితగా నిలబడటానికి కారణమైన ఓ జ్ఞాపకం గురించి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన గోపాలకృష్ణ ప్రస్తావించారు. ‘పరుచూరి పలుకులు’లో దీని గురించి ఆయన చెప్పారు. ‘ఇది నేను నా శ్రీమతితో జీవితంలో గెలవడానికి కారణమైంది. 1981 అక్టోబర్ అది. మద్రాసు వస్తే నువ్వు గొప్పవాడివి అవొచ్చని పీసీ రెడ్డిగారు చెప్పారు. అప్పుడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ‘ది క్యారెక్టర్ పోర్ట్రెయిల్ ద్రౌపది ఇన్ తెలుగు మహాభారతం’ పై థీసిస్ చేసేందుకని నా ఉద్యోగానికి సంవత్సరం పాటు సెలవు పెట్టాను. ఇటు థీసిస్ పని, అటు సినిమా అవకాశాలు చూసుకోవచ్చని అనుకున్నాను.

దాంతో 1981 అక్టోబర్ 21 నుంచి సెలవులోఉన్న నేను మద్రాసు వెళ్లి స్థిరపడాలనే ఉద్దేశంలో ఉన్నాను. ఉద్యోగస్తుడిగా నాకు నెలకు రూ.1100 జీతం వచ్చేది. నాకు ఇతర ఆదాయమేదీ లేదు. మా ఆవిడకు రెండు ఎకరాల పొలం ఉంది కానీ, దాని మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ. నేను మద్రాసు బయలుదేరి వెళ్లాలని అనుకున్నప్పుడు మా ఆవిడ నాతో ఓ మాట అంది..

‘1979 నుంచి మద్రాసు తిరుగుతూనే ఉన్నారు. చాలాసార్లు మీరు మద్రాసు వెళ్లినప్పుడు నా గొలుసు తాకట్టుపెట్టి డబ్బులివ్వడమే తప్ప, అక్కడి (మద్రాసు) నుంచి మీరు డబ్బేమీ తేవట్లేదు! ఏదో, అప్పుడప్పుడు పిల్లలకు గౌన్లు కొనుకొచ్చారు. ఇప్పుడు, ఉన్నపళంగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి మద్రాసు వెళ్లడం అవసరమా? సినీ రచయితగా ఒక ఏడాది మీకు అవకాశం రాకపోతే, ‘నేను, నా ముగ్గురు పిల్లలు ఎలా బతకాలి?’ అని నా భార్య ప్రశ్నించింది.

అప్పుడప్పుడే ఎదుగుతున్న ఓ రచయితకు ఇది షాకింగ్ క్వశ్చన్! నేను బాగా ఆలోచించి ఆమెకు సమాధానం చెప్పా. ‘ఈరోజు అక్టోబర్ 21 కదా. నవంబర్ 1 మన మూడో అమ్మాయి పుట్టినరోజు. ఆరోజు ఎంతో ప్రత్యేకమనుకుని నేను మద్రాసు బయలుదేరతా. మళ్లీ డిసెంబర్ 1న నీ ముందే ఉంటా. ఈ నెల రోజుల్లో అక్కడ (మద్రాసు)లో నా ఖర్చులు పోగా, నీకు పదకొండు వందల రూపాయలు ఇవ్వకపోతే..నేను మళ్లీ మద్రాసు వెళ్లను. నా లీవ్ క్యాన్సిల్ చేసేసుకుని ఉద్యోగం చేసుకుంటాను’ అనే ఛాలెంజ్ తో నేను మద్రాసు వెళ్లాను’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News