Mohan Babu: నా భార్య అలా పిలవడం మానేసింది.. ఇప్పుడు అనసూయ పిలిచింది!: మోహన్‌బాబు

  • ‘గాయత్రి’ ఆడియో ఫంక్షన్‌లో నవ్వులు పూయించిన మోహన్‌బాబు
  • మోహన్‌బాబును బావా అని పిలిచిన అనసూయ
  • సక్సెస్ లేకపోతే భార్య కూడా మాట్లాడదన్న ‘గాయత్రి’ హీరో

విలక్షణ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘గాయత్రి’ సినిమా ఆడియో వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఫంక్షన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనసూయ మాట్లాడుతూ మోహన్‌బాబును ‘బావా’ అని పిలిచింది. దీంతో స్పందించిన మోహన్‌బాబు మాట్లాడుతూ నవ్వులు పూయించారు. తన భార్య తనను బావా అని పిలిచేదని, ఇప్పుడు తనకు సక్సెస్‌లు లేకపోవడంతో అలా పిలవడం మానేసిందని అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

సక్సెస్ లేకపోతే ఎవరూ పిలవరని, కానీ ఈ రోజు అనసూయ పిలిచిందని చెబుతూ.. ‘రా షేక్ హ్యాండ్ ఇవ్వు’ అని అనసూయకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. తన ప్రతి సినిమాలోనూ ఎవరితో ఒకరితో గొడవ ఉంటూనే ఉంటుందని పేర్కొన్న మోహన్‌బాబు ఈ సినిమాకు చాలా కంట్రోల్ చేసుకున్నానని తెలిపారు. గొడవ జరక్కూడదని భగవంతుడికి ప్రార్థించి మరీ షూటింగ్‌కు వెళ్లేవాడినని పేర్కొన్నారు.

అనసూయ వెరీ సిన్సియర్ అని మోహన్‌బాబు కితాబిచ్చారు. ఆమె గురించి కూడా తనకు ఎన్నో చెప్పారని పేర్కొన్నారు. లక్ష్మి అయితే అనసూయను పొగడడమే పనిగా పెట్టుకుంటుందని అన్నారు. ఈసారి విష్ణు వచ్చి ‘డాడీ షీ ఈజ్ వెరీ గుడ్ గాళ్’ అని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. నిజానికి తాను ఈ ఫంక్షన్‌కు అనసూయను  పిలవాలని అనుకోలేదని పేర్కొన్న మోహన్ బాబు ఏది ఏమైనా మన ఇద్దరిని విష్ణు కలిపాడని, క్రెడిట్ మొత్తం విష్ణుకే అని పేర్కొన్నారు.

More Telugu News