Wi-Fi: ఇప్పుడు చాయ్ కంటే తక్కువకే వై-ఫై.. రూపాయితో మొదలు!

  • వై-ఫై కూపన్లకు పెరుగుతున్న డిమాండ్
  • దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్న స్టార్టప్‌లు
  • రూ.5 కూపన్‌కు భలే గిరాకీ!

వై-ఫై ఇప్పుడు నిత్యావసర జాబితాలో చేరిపోయింది. వై-ఫై లేని చోటు లేదంటే అతిశయోక్తి కాదేమో! అయితే ఇప్పుడు రోజూ తాగే టీ కంటే కూడా చవగ్గా వై-ఫై అందుబాటులోకి వచ్చేసింది. ఇకపై చాయ్ దుకాణం, లేదంటే పక్కనే ఉన్న కిరాణా షాపు నుంచి వై-ఫై కూపన్లు కొనుక్కొని ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు.

ఇందుకోసం ఢిల్లీ, బెంగళూరులోని కొన్ని స్టార్టప్‌లు ప్రీ-పెయిడ్ వై-ఫై ప్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. రూపాయి నుంచి రూ.20 వరకు అందరికీ అందుబాటులో ఉండేలా కూపన్లను విడుదల చేస్తున్నాయి. పట్టణాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యంత చవగ్గా వైర్‌లెస్ ఇంటర్నెట్‌ను అందించడమే లక్ష్యంగా స్టార్టప్‌లు రంగంలోకి దిగాయి.

హరియాణా సరిహద్దులో ఉన్న ఢిల్లీలోని సంగం విహార్‌కు చెందిన ఓ స్టేషనరీ దుకాణ యజమాని బ్రహం ప్రకాశ్ ఇప్పటికే 250 వై-ఫై కూపన్లను విక్రయించాడు. రెండు నెలల క్రితం దుకాణంలో వై-ఫై హాట్ ‌స్పాట్‌ను ఏర్పాటు చేసుకున్న అతను ఐదు నిమిషాల పాటు వై-ఫైను ఉపయోగించుకునేందుకు రూపాయి కూపన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. తన వద్ద రూ.20 కూపన్లు కూడా ఉన్నాయని ప్రకాశ్ చెప్పుకొచ్చాడు. 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వారు కూపన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు తెలిపాడు. రూపాయి ఖర్చుతో ఐదు నిమిషాల్లో తమకు కావాల్సిన గేములు, పాటలను డౌన్ లోడ్  చేసుకుని వెళ్లిపోతున్నట్టు చెప్పాడు.

ఢిల్లీకి చెందిన ‘ఐ2ఆ1’, బెంగళూరుకు చెందిన ‘వైఫై డబ్బా’ స్టార్టప్‌లు పబ్లిక్ డేటా ఆఫీసు(పీడీవో)లు ప్రారంభించి ప్రతి ఒక్కరికి వై-ఫైని అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఖరీదైన ప్రాంతాల్లో మాత్రం వై-ఫై కూపన్లు అమ్ముడుపోవడం లేదని ఢిల్లీకి చెందిన ఓ టీస్టాల్ యజమాని వాపోయాడు. తాను ఇప్పటి వరకు ఒక్క కూపన్ కూడా విక్రయించలేదని, వై-ఫై రౌటర్‌ను  తిరిగి ఇచ్చేయాలని భావిస్తున్నట్టు తెలిపాడు. అయితే మిగతా వారు మాత్రం ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం రూ.5 వై-ఫై కూపన్‌కు మంచి డిమాండ్ ఉందని ఓ షాప్ కీపర్ తెలిపాడు. కాగా, వై-ఫై కూపన్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు స్టార్టప్‌లు రంగం సిద్ధం చేశాయి.

More Telugu News