davos: దావోస్ స‌ద‌స్సుకు సంబంధించి టాప్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఇదే!

  • 39,251 సార్లు ట్రెండ్ అయిన‌ #IndiaMeansBusiness
  • ఎక్కువ ప్ర‌స్తావించిన పేరు డొనాల్డ్ ట్రంప్‌
  • వివ‌రాల‌ను వెల్ల‌డించిన టాక్‌వాక‌ర్ అనే సంస్థ‌

ఇటీవ‌ల స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో ప్ర‌పంచ ఆర్థిక వేత్త‌ల స‌ద‌స్సు జరిగిన సంగ‌తి తెలిసిందే. దానికి సంబంధించి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అయిన ప‌దాల, ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన వ్య‌క్తుల వివ‌రాల‌ను అమెరికాకు చెందిన టాక్‌వాక‌ర్ అనే విశ్లేష‌ణా సంస్థ వెల్ల‌డించింది. అక్క‌డ ప్ర‌సంగంలో భాగంగా ప్ర‌ధాని మోదీ ప్ర‌స్తావించిన ‘భారత్‌ అంటే బిజినెస్‌’ (#IndiaMeansBusiness) అనే ప‌దం నెం.1 స్థానంలో ట్రెండ్ అయిన‌ట్లు టాక్‌వాక‌ర్ పేర్కొంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ను నెటిజన్లు 39,251సార్లు ప్రస్తావించార‌ని తెలిపింది.

ఇక తర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా మహిళలు (35,837సార్లు), అమెరికా ఫస్ట్ (31,449సార్లు), సంపద (22,896సార్లు), ఏఐ (19,018సార్లు), ప్రపంచీకరణ (16,513సార్లు), వాతావరణ మార్పులు (15,477సార్లు), ఫేక్‌న్యూస్ (13,567సార్లు) హ్యాష్‌ట్యాగ్‌లు నిలిచిన‌ట్లు టాక్‌ వాకర్ చెప్పింది.

వీరు నిర్వ‌హించిన స‌ర్వేలో భాగంగా సోషల్‌మీడియాలో నెటిజ‌న్లు అత్యంత ఎక్కువగా ప్రస్తావించిన వ్యక్తుల వివ‌రాల‌ను కూడా తెలుసుకుంది. వీరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మొద‌ట స్థానంలో నిలిచారు. ఆయన పేరును నెటిజ‌న్లు దాదాపు 2,73,000 సార్లు ప్రస్తావించారని కంపెనీ తెలిపింది.

ఇక తర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా భారత ప్రధాని నరేంద్ర మోదీ (62,227సార్లు), ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రన్ (40,975), బ్రిటిష్‌ ప్రధాని థెరిసా మే(27,791), కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(25,809), జర్మనీ అధ్యక్షురాలు ఏంజెలా మెర్కెల్‌(23,897), బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌(13,573)లు ఉన్నారు. ఇంకా ఈ ఏడాది దావోస్ అనే ప‌దం 2.2 మిలియన్ల సార్లు ప్రస్తావ‌న‌కు రాగా, గ‌తేడాది 7,95,000 సార్లు ప్రస్తావ‌న‌కు వ‌చ్చింద‌ని టాక్‌వాక‌ర్ స‌ర్వేలో తేలింది.

More Telugu News