Narendra Modi: తగ్గుతున్న మోదీ ప్రభ.. ఈసారి ఎన్నికల్లో బొటాబొటి సీట్లు!

  • ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో మోదీకి తగ్గిన ప్రజాదరణ
  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 300 లోపు సీట్లే
  • పెరుగుతున్న యూపీఏ బలం.. రాహుల్‌కు ప్రజాదరణ

ప్రధాని నరేంద్రమోదీ ప్రభ రోజురోజుకు మసకబారుతోందా? అంటే అవుననే అంటోంది తాజా సర్వే. లోక్‌నీతి-సీఎస్‌డీఎస్-ఏబీపీ కలిసి ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. గతేడాది నిర్వహించిన సర్వే ఫలితాలతో తాజా పరిస్థితిని పోల్చి చూసినప్పుడు ప్రజల్లో మోదీపై ఉన్న ఆకర్షణ తగ్గుతున్నట్టు తేలింది. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చిన సర్వే ఈసారి మాత్రం మోదీ ప్రభంజనం ఉండదని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన  సీట్లు మాత్రం బీజేపీ దక్కించుకుంటుందని పేర్కొంది.

ఎన్డీఏ కూటమికి 293 నుంచి 309 స్థానాలు వస్తాయని తెలిపింది. కాగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ 59 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి యూపీఏ బలం 122 నుంచి 132కు పెరుగుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీకి ప్రజల్లో ఆదరణ క్రమంగా పెరుగుతోంది. 8 నెలల క్రితం ప్రధానిగా రాహుల్‌కు 9 శాతం మంది ఓటు వేయగా, ఇప్పుడది 20 శాతానికి చేరుకోవడం గమనార్హం. మోదీ మళ్లీ ప్రధాని కావాలని 2017లో 44  శాతం మంది కోరుకోగా, ఇప్పుడది 37 శాతానికి పడిపోయింది.

More Telugu News