smart phone: స్మార్ ఫోన్ తో ఆనందం ఆవిరి....పది లక్షల మందిపై సర్వేలో వెల్లడి!

  • స్మార్ట్ ఫోన్ అతిగా వాడేస్తున్న యువత
  • స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్స్‌, కంప్యూటర్లపై వెచ్చించే సమయాన్ని లెక్కించిన పరిశోధకులు
  • సత్సంబంధాలు, వ్యాయామం, ఆటల సమయం లెక్కింత

స్మార్ట్‌ ఫోన్ వాడకం విషయంలో టీనేజర్లదే ముందజ అన్న సంగతి తెలిసిందే. ఛాటింగ్ పేరులో గంటలతరబడి టీనేజర్లు స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కుపోతారంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తుంటారు. ఫోన్ ఎక్కువగా వాడే యువతపై యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాకు చెందిన పరిశోధకులు ఒక సర్వే చేశారు. సుమారు 10 లక్షలకు పైగా అమెరికన్ టీనేజర్లపై ఈ సర్వే నిర్వహించడం విశేషం. ఇందులో విద్యార్థులను స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్స్‌, కంప్యూటర్లపై ఎంత సమయం వెచ్చిస్తారని ప్రశ్నించారు. దానితో పాటు వారి సామాజిక సంబంధాలు, సంతోషంగా ఉండే అంశాలను కూడా పరిశీలించారు. ఆటలు ఆడడం, పత్రికలు చదవడం, ఇతరులతో నేరుగా సత్సంబంధాలు పెంచుకోవడం వంటి వివరాలను కూడా తెలుసుకున్నారు.

 దీంతో కంప్యూటర్‌ గేమ్స్‌, సోషల్‌  మీడియా, మెసేజ్‌, వీడియో చాటింగ్‌ వంటి వాటిల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్న యువత కంటే ఇతరులతో సత్సంబంధాలు నెరపుతున్న యువత ఆనందంగా ఉంటోందని తేలింది. దీంతో సోషల్‌ మీడియా అధికంగా ఉపయోగించడం వల్ల సంతోషం తగ్గుతోందని వారు తేల్చారు. దీనిని బలపరుస్తూ, శాన్‌ డీగో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మాట్లాడుతూ, సంతోషంగా ఉన్న టీనేజీ కుర్రాడు డిజిటల్‌ మీడియాకు రోజులో గంట కంటే  తక్కువ సమయం కేటాయిస్తాడని తేల్చిచెప్పారు.

కంప్యూటర్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ చూసే సమయం పెరుగుతున్న కొద్దీ సంతోషం తగ్గుతూ ఉంటుందని వెల్లడించారు. గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కు పోకుండా నేరుగా స్నేహితులతో మాట్లాడడం, ఆటలాడడం, వ్యాయామం చేయడం ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తాయని ఈ సర్వే తేల్చిచెప్పింది. దీంతో సోషల్‌ మీడియాను పరిమితంగా ఉపయోగిస్తేనే సంతోషం దక్కుతుందని పరిశోధకులు నివేదికలో స్పష్టం చేశారు. 

More Telugu News