Kurnool District: 'నన్నే పెళ్లాడాలి' అంటూ మహిళా ప్రొఫెసర్ ను వేధిస్తున్న ముగ్గురు ప్రొఫెసర్లు.. రాయలసీమ వర్శిటీలో కలకలం!

  • పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్న అధ్యాపకులు
  • మెరిట్ పై కాంట్రాక్టు ప్రొఫెసర్ గా చేరిన యువతి
  • ఆమెపై మోహంతో లైంగిక వేధింపులు
  • చర్యలు తీసుకుంటామన్న రిజిస్ట్రార్

తననే పెళ్లి చేసుకోవాలంటూ, తోటి అధ్యాపకురాలిని లైంగికంగా వేధిస్తున్న ముగ్గురు ప్రొఫెసర్ల ఉదంతం బయటపడటం కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీలో కలకలం రేపుతోంది. అవివాహితురాలైన ఓ యువతి, మెరిట్ పై కాంట్రాక్టు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 2017 జూలైలో ఉద్యోగంలో చేరారు. ఆమెను చూసి మోహించిన ముగ్గురు తోటి ప్రొఫెసర్లు, తనను పెళ్లి చేసుకోవాలంటే, తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నారు.

వారి వేధింపులను తట్టుకోలేని బాధితురాలు, ఉద్యోగం వదిలి వెళ్లడానికి సిద్ధమై, సన్నిహితుల వద్ద వాపోగా, విషయాన్ని వర్శిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామని ఆమెకు నచ్చజెప్పి, తీసుకువెళుతున్న క్రమంలో ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆపై ఆమెను విద్యార్థులు, ఇతర అధ్యాపకులు హాస్పిటల్ కు తరలించారు. కాగా, ఆమెను వేధించిన వారిపై గతంలో ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తాజా ఘటనపై విచారిస్తున్నామని, వారిపై చర్యలు తీసుకుంటామని వర్శిటీ రిజిస్ట్రార్ అమర్ నాథ్ హామీ ఇచ్చారు.

More Telugu News