rich: మన దేశంలో 73 శాతం సంపదను సృష్టించింది ఒక్క శాతం మంది సంపన్నులే!

  • ఆదాయ అసమానతలపై ఆక్స్ ఫామ్ సర్వే
  • మన దేశంలో ఒక్క శాతం మంది సంపద కేంద్ర బడ్జెట్ కు సమానం
  • ఆర్థిక విధానాలు సంపన్నులకే మేలు చేస్తున్నాయన్న ఆక్స్ ఫామ్

గతేడాది దేశంలో 73 శాతం సంపదను సృష్టించింది ఒక శాతం సంపన్నులేనని అంతర్జాతీయ హక్కుల గ్రూపు ఆక్స్ ఫామ్ నిర్వహించిన సర్వే తేల్చింది. ఆదాయ అసమతుల్యతను ఈ సర్వే కళ్లకు కట్టింది. దేశంలో 67 కోట్ల మంది సంపద మాత్రం ఇదే సమయంలో కేవలం 1 శాతమే పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా చూస్తే సంపద అసమానతలు ఇంకా ఎక్కువే ఉన్నాయని ఆక్స్ ఫామ్ ఈ రోజు విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలుస్తోంది.

గతేడాది అంతర్జాతీయంగా 82 శాతం సంపద కేవలం ఒక శాతం సంపన్నుల చేతుల్లోనే ఉండడం గమనించాల్సిన అంశం. అదే సమయంలో 370 కోట్ల మంది ప్రజల సంపదలో ఏ మాత్రం ఎదుగూ బొదుగూ లేదు. దేశంలో మొత్తం సంపదలో 58 శాతం ఒక్క శాతం సంపన్నుల చేతుల్లోనే ఉందని ఈ సర్వేలో తేలింది. అంతర్జాతీయంగా చూస్తే ఒక శాతం సంపన్నుల చేతుల్లో 50 శాతం ప్రపంచ సంపద మూలుగుతోంది.

మనదేశంలో ఒక శాతం మంది ఉన్నత వర్గాల వద్దనున్న సంపద 2017లో రూ.20.9 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 2017-18 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ కు సమాన స్థాయి అని ఆక్స్ ఫామ్ పేర్కొంది. వందల కోట్ల మంది పేదరికంతో పోరాడుతుంటే, సంపన్న వర్గాలు మరింత భారీగా సంపదను పోగు చేసుకునేలా అంతర్జాతీయ ఆర్థిక విధానాలు తోడ్పడుతున్నాయని విమర్శించింది.

More Telugu News