Andhra Pradesh: చంద్రబాబు, జగన్ పరస్పరం తిట్టుకోవడమే సరిపోతోంది.. ఇంక కేంద్రాన్ని ఏం నిలదీస్తారు? : చలసాని శ్రీనివాస్
- హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వం
- ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడతాం
- ప్రత్యేక హోదాపై పార్లమెంట్ ను స్తంభింపజేయాలి
- మీడియా సమావేశంలో చలసాని శ్రీనివాస్
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని ‘కేంద్రం’పై ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మరోసారి మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహించారు. హామీల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ లు పరస్పరం తిట్టుకోవడమే సరిపోతుంది తప్ప, ఈ విషయమై ప్రధాని మోదీని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలని నిలదీయడం లేదని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన ఆయన, ప్రత్యేక హోదాపై పార్లమెంట్ ను స్తంభింపజేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ ఎంపీలు ఈ విషయమై కేంద్రాన్ని నిలదీయాలని, అవసరమైతే ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించాలని, ప్రత్యేక హోదా పై రాజకీయ నేతలను నిలదీయాలని డిమాండ్ చేశారు.