Chandrababu: టీడీపీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదు: సీఎం చంద్రబాబు

  • ఉండవల్లిలో టీడీపీ ఒకరోజు వర్క్ షాప్
  • నేతల పనితీరు బాగుంటే ప్రజలు నిరంతరం ఆదిరిస్తారు
  • చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలి: చంద్రబాబు

ఏపీలో టీడీపీని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ ఒకరోజు వర్క్ షాప్ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ వర్క్ షాప్ లో చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికలంటే గతంలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడి ఉండేవని, ఇప్పుడు అలా లేదని, పనితీరునే ప్రజలు ప్రమాణంగా తీసుకుంటున్నారని అన్నారు.

నేతల పనితీరు బాగుంటే ప్రజలు నిరంతరం ఆదిరిస్తారని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాయకులు ప్రణాళికలు రచించుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలకు ఇకపై కష్టకాలమేనని, పనిచేయకపోతే వారికి ఇబ్బందులు వస్తాయని అన్నారు. ‘ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపిస్తే పనిచేయకపోతే ఎలా?’ అని ఆయన ప్రశ్నించారు.

 ఈ మూడు జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పనితీరు మార్చుకోని పరిస్థితిలో ‘నేను వచ్చి మీ దగ్గర నిరాహారదీక్ష చేస్తా, అప్పుడైనా మీపై ఒత్తిడి పెరుగుతుంది’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జాతిపిత మహాత్మాగాంధీ గతంలో ఇదే పద్ధతిని అనుసరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

More Telugu News