robo 2.0: ఆ క్షణంలో రజనీని చూస్తూ యూనిట్ మొత్తం అలా ఉండిపోయాం: అక్షయ్ కుమార్

  • భారత చలనచిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న '2.0' సినిమా
  • బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉండగా విలన్ గా నటించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నలు
  • చాలా స్టైల్ గా దుమ్ముదులుపుకున్న రజనీకాంత్

భారత చలనచిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న '2.0' సినిమాలో నటించమంటూ వచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటానని ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్ ప్రశ్నించాడు. బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉండగా విలన్ గా నటించాల్సిన అవసరం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారని ఆయన తెలిపాడు.

విలన్ ఉన్నప్పుడే హీరో ఉంటాడని అక్షయ్ గుర్తు చేశాడు. ఈ సినిమా పోస్టర్‌ లో చెప్పినట్టు సినిమాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశాడు. ఈ సినిమాలోని అంశాలేవీ ఇతరులకు తెలియదని, చిత్రంలో భాగమైన తమకు ఏ విషయం బయటకు చెప్పే అధికారం లేదని అన్నాడు. అయితే ఈ సినిమా చూసినప్పుడు మాత్రం అంతా సర్‌ ప్రైజ్‌ అవుతారని భరోసా ఇచ్చాడు.

ఇంతటి భారీ బడ్జెట్‌ సినిమాలో నటిస్తానని తానెప్పుడూ ఊహించలేదని, అలాంటి అవకాశం వచ్చిన వెంటనే ఓకే చెప్పేశానని అక్షయ్ తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ, ‘ఒక రోజు సెట్‌ లో తరువాతి షాట్‌ కోసం రెడీ అవుతుండగా, రజనీ తన ప్యాంట్‌ కు అంటుకున్న దుమ్మును దులుపుకుంటున్నారు. ఆయన ఆ పని ఎంత స్టైల్‌ గా చేస్తున్నారంటే.. చిత్ర యూనిట్‌ మొత్తం అలా ఆయన్ని చూస్తూ ఉండిపోయాం. ఆయన ఏం చేసినా అంత స్టైల్‌ గా ఉంటుంది' అని చెప్పారు అక్షయ్. అలాంటి రజనీ చేతిలో దెబ్బలు తినడాన్ని కూడా ఎంజాయ్‌ చేస్తానని అక్షయ్‌ కుమార్ తెలిపాడు. కాగా, ఆక్షయ్ నటించిన 'ప్యాడ్ మ్యాన్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 

More Telugu News