Mobile: బీ కేర్‌పుల్! ఇకపై మొబైల్‌లో తీసిన ఫొటోలు, వీడియోలు కూడా సాక్ష్యాధారాలే!

  • ‘ఎవిడెన్స్ యాక్ట్, 1872’ను సవరించేందుకు సిద్ధమైన కేంద్రం
  • చట్ట సవరణపై రాష్ట్రాల అభిప్రాయం సేకరణ
  • సవరణ జరిగితే విచారణలో కీలకం కానున్న మొబైల్ ఫొటోలు, వీడియోలు

మొబైల్‌లో తీసిన ఫొటోలు, వీడియోలు కూడా ఇకపై సాక్ష్యాధారాలుగా మారనున్నాయి. ఇప్పటి వరకు కోర్టులు వీటిని సాక్ష్యాధారాలుగా పరిగణించడం లేదు. మొబైల్‌లో తీసిన ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి డాక్టరింగ్ చేసే అవకాశం ఉండడంతో వీటిని సాక్ష్యాలుగా పరిగణించడం లేదు. అయితే ఇప్పుడు ‘ఎవిడెన్స్ యాక్ట్, 1872’ను సవరించి వీటిని కూడా చేర్చాలని కేంద్రం  యోచిస్తోంది. విచారణ సమయంలో వీటిని కూడా ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోవాలని యోచిస్తోంది.

ఈ మేరకు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. ఉత్తరప్రదేశ్‌లో షహరాన్‌పూర్‌లో జరిగిన జాట్ల అలర్లు, రోహ్‌తక్ ఘటన, దళిత వ్యతిరేక అల్లర్ల విషయంలో భద్రతా దళాల లోపంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

‘‘సెల్యూలార్  ఫోన్ ద్వారా  తీసిన ఫొటోలు, సీసీ టీవీల్లో రికార్డ్ అయిన వీడియోలను కూడా ‘ఎవిడెన్స్ యాక్ట్, 1872’ ప్రకారం సాక్ష్యాధారాలుగా పరిగణించాలి. క్రిమినల్ పీనల్ కోడ్/ఎవిడెన్స్ యాక్ట్‌ను ఈ మేరకు సవరించాలి’’ అని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ సవరణలకు ఆమోదం లభించి చట్టంలో చేర్చితే నేరస్తులు ఇక తప్పించుకునే వీలుండదని యూపీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

More Telugu News