JP Duminy: శివాలెత్తిన దక్షిణాఫ్రికా ఆటగాడు డుమిని.. ఒకే ఓవర్‌లో37 పరుగులు

  • బౌలర్ ఎడ్డీ లీకి చుక్కలు చూపించిన డుమినీ
  • 37 బంతుల్లో 70 పరుగులు
  • ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమినీ శివాలెత్తిపోయాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 37 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా డుమీని రికార్డు సృష్టించాడు. మొమెంటమ్ వన్డే కప్‌లో భాగంగా కేప్ కోబ్రాస్-నైట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోబ్రాస్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డుమినీ చెలరేగిపోయాడు. లెగ్ స్పిన్నర్ ఎడ్డీ లీ వేసిన ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు, ఫోర్, రెండు పరుగులు, ఓ నోబాల్‌తో కలిపి 37 పరుగులు రాబట్టాడు. మొత్తంగా 37 బంతుల్లో 70 పరుగులు చేసిన డుమినీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

240 పరుగుల విజయ లక్ష్యంతో కోబ్రాస్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. డుమినీ చెలరేగి పోయిన ఆ ఓవర్‌కు ముందు జట్టు స్కోరు 208/2. ఆ తర్వాతి ఓవర్‌కు డుమినీ శివాలెత్తడంతో ఒక్క ఓవర్‌లోనే జట్టు విజయాన్ని అందుకుంది. కాగా, లిస్ట్-ఎ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు జింబాబ్వే క్రికెటర్ ఎల్టన్ చిగుంబర పేరుపై ఉంది. అక్టోబరు 2013లో ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో బంగ్లాదేశ్‌పై చిగుంబర రెచ్చిపోయి ఆడాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 39 పరుగులు చేశాడు. ఇప్పటికీ అదే రికార్డు.

More Telugu News