Pawan Kalyan: కత్తి మహేశ్ పై దాడికి నిరసనగా.. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని ఓయూ జేఏసీ పిలుపు!

  • హైదరాబాద్ లోని కొండాపూర్ లో సంఘటన
  • కత్తి మహేశ్ పై దాడిని ఖండించిన ఓయూ జేఏసీ
  • తెలంగాణ వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మల దగ్ధానికి పిలుపు

ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొని వెళుతున్న ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో ఈరోజు రాత్రి దాడి చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కారు దిగిన వెంటనే ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం. కాగా, ఈ సంఘటనను ఓయూ జేఏసీ ఖండించింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ వ్యాప్తంగా పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని పిలుపు నిచ్చింది.

ఈ సందర్భంగా ఓయూ జేఏసీకి చెందిన రవి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో దాడులు చేయడమనేది అనాగరికమని మండిపడ్డారు. ఈ దాడిని తాము ఖండిస్తున్నామని అన్నారు. పవన్ కల్యాణ్ తన అభిమానులకు మాట మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని యూనివర్శిటీలకు ఈ మేరకు సమాచారం అందిస్తామని, పవన్ కల్యాణ్ నటించిన ఏ సినిమాను తెలంగాణలో ఆడనివ్వమని, కత్తి మహేశ్ కు అండగా ఉంటామని అన్నారు.

‘ఖబడ్దార్ పవన్ కల్యాణ్.. తెలంగాణలో నిన్ను తిరగనివ్వం. అభిమానులకు చెప్పుకోలేని మూగవాడివి. నీ అభిమానులతో కత్తి మహేశ్ పై దాడి చేయిస్తావా?’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

More Telugu News