Chandrababu: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీ అగ్రగామిగా ఉంది: సీఎం చంద్రబాబునాయుడు

  • 24-26 తేదీలలో విశాఖపట్నంలో  సిఐఐ సదస్సు
  • న్యూఢిల్లీలో ఈరోజు సన్నాహక సదస్సు
  • పారిశ్రామిక మౌలిక రంగాలలో పెట్టుబడులకు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు ముందుకు రావాలి: చంద్రబాబు

‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. 2018 ఫిబ్రవరి 24-26 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐఐ సదస్సుకు సన్నాహకంగా న్యూ ఢిల్లీలోని తాజ్ హోటల్ లో ఏర్పాటు చేసిన సన్నాహక సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభుతో కలసి ఆయన పాల్గొన్నారు. వివిధ దేశాల పారిశ్రామిక వేత్తలు, రాయబారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, పారిశ్రామిక మౌలిక రంగాలలో పెట్టుబడులకు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక లోటుతో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామికీకరణ, వ్యవసాయరంగాలలో రెండంకెల అభివృద్ధిని సాధిస్తున్నదని అన్నారు.

గడచిన మూడున్నరేళ్లలో 2015 – 16 ఆర్ధిక సంవత్సరంలో 10.99 శాతం, 2016 –17 ఆర్ధిక సంవత్సరంలో 11.61శాతం,  2017 –18 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 11.37 శాతం అభివృద్ధి గణాంకాలను నమోదు చేసిందని, ఇదేకాలంలో కేంద్ర ప్రభుత్వం 7.6 శాతం, 7.1 శాతం, 5.1 శాతం అభివృద్ధి రేటును సాధించిందని అన్నారు. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విజన్ డాక్యుమెంట్ ప్రధాన కారణమని ఆయన విశదీకరించారు.

గత 24 సంవత్సరాల సిఐఐ సదస్సులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరు సార్లు ఆతిథ్యం ఇవ్వగా, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా గత మూడు సంవత్సరాల నుంచి ఈ సదస్సులకు ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, వనరులను వివరిస్తూ ప్రపంచం నలుమూలల వివిధ దేశాలలో పర్యటించి పారిశ్రామిక వేత్తలతో సమావేశమై పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రష్యా, చైనా, జపాన్, సింగపూర్, దావోస్ వంటి దేశాలలోని పారిశ్రామిక వేత్తలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుటకు ముందుకు రావటం శుభ పరిణామం అని అన్నారు.

సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉందని, గుజరాత్ రాష్ట్రం తరువాత కార్గో రంగంలో పెట్టుబడులకు ఈ తీర ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లు ప్రధానంగా పారిశ్రామిక పెట్టుబడులకు ఎంతో అనువుగా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ కారిడార్ లో ఇప్పటి వరకు 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 973 ప్రాజెక్టులను ఏర్పాటు చేసి 24 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. వైద్య రంగంలో వస్తున్న వినూత్నమైన మార్పులకు అనుగుణంగా వైద్య పరికరాల తయారీ రంగం ఆంధ్రప్రదేశ్ అనువుగా ఉందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టుటకు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు.  

రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిపాలన, సంక్షేమ  రంగాలలో విస్తృతమైన అవకాశాలను పెంపొందిస్తున్నట్లు చెప్పారు.  నూతన సాంకేతికతను వినియోగిస్తూ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రతి గృహానికి రూ.149 కే ఇంటర్నెట్, టెలిఫోన్, టివీ ద్వారా 3 వందల శాటిలైట్ చానల్స్ ను చూసే అవకాశాన్ని కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కిందని అన్నారు.

నూతనంగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా 3 వేల 5 వందల ఎకరాల భూమిని సమకూర్చడం ముదావహం అన్నారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ కాపిటల్ సిటి ఏర్పాటు, క్లీన్ & గ్రీన్ బ్లూ సిటీ ఏర్పాటు, ఎలక్ట్రిక్ వాహనాల రవాణాకు ఎంతో అనువుగా నిర్మాణాలతో నూతన రాజధానిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అమరావతి రాజధానిలో పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని ఆయన కోరారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇటీవల తమ రష్యా పర్యటనలో అక్కడి అధికారులు, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి అడిగి తెలుసుకోవడం సంతోషదాయకమని అన్నారు. డైనమిక్ లీడర్, డైనమిక్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో వినూత్నమైన పోకడలతో అభివృద్ధిని సాధిస్తున్నదంటూ ముఖ్యమంత్రి కృషిని ప్రత్యేకంగా ఆయన ప్రశంసించారు. విశాఖపట్నంలో జరుగనున్న పారిశ్రామిక పెట్టుబడుల సదస్సులో అన్ని దేశాలవారు పాల్గొని పెట్టుబడులు పెట్టుటకు ముందుకు రావాలని కోరారు.

అరుణ్ జైట్లీతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబునాయుడు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ఆయన కార్యాలయంలో సమావేశమై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విడుదల కావలసిన నిధుల గురించి ప్రత్యేకంగా చర్చించారు. సమావేశానంతరం చంద్రబాబు నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనలో ప్రత్యేక ప్యాకేజి క్రింద కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నిధులను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కూడా విడుదల చేయాలని కోరగా అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారని, నిధుల విడుదలకు హామీ ఇచ్చినట్లు చెప్పారు.  

More Telugu News