Drunken Drive: మందు మత్తులో అర్ధరాత్రి పోలీసుల ముందు నానాయాగీ చేసిన యువతి!

  • హైదరాబాద్ లో పోలీసుల డ్రంకెన్ డ్రైవ్
  • పట్టుబడిన 59 మంది మందు బాబులు
  • 34 కార్లు, 25 బైకులు సీజ్

సంక్రాంతి పర్వదినం రోజుల్లో రాత్రి పూట మందు కొట్టి రోడ్డెక్కిన వారిపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝళిపించారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా పలువురు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు సమీపంలోని చిరంజీవి బ్లడ్ బ్యాంకు వద్ద పూటుగా మద్యం తాగి, కారు నడుపుకుంటూ వచ్చిన ఓ యువతి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది.

బ్రీత్ టెస్టుకు సహకరించకుండా కారు తాళాలు తీసుకుని రోడ్లపై పరుగు తీసింది. తనకు పెద్దలు తెలుసునంటూ, వారితో ఫోన్లు చేయించింది. అతి కష్టం మీద ఆమెను అదుపు చేసిన పోలీసులు, బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరిపి మోతాదుకు మించి మందు కొట్టినట్టు తేల్చారు. ఈ తనిఖీల్లో మొత్తం 59 మంది పట్టుబడ్డారని, 34 కార్లు, 25 బైకులను సీజ్ చేశామని  పోలీసులు వెల్లడించారు. పట్టుబడినవారిలో 10 మందికి పైగా యువతులు ఉండటం గమనార్హం.

More Telugu News