VHP: పోలీసులు నన్ను ఎన్ కౌంటర్ చేసి చంపాలని చూస్తున్నారు... ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణ!

  • అదృశ్యమై ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో కనిపించిన ప్రవీణ్ తొగాడియా
  • మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు
  • అరెస్ట్ చేసి ఎన్ కౌంటర్ చేసేందుకు రాజస్థాన్ పోలీసులు చూశారు
  • మాట్లాడకుండా ఉంచేందుకు స్వర పేటికను దెబ్బతీయబోయారు

ఒకరోజంతా ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయి, ఆపై అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కనిపించిన విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా, సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఉదయం మీడియా ముందుకు వచ్చిన ఆయన కన్నీరు పెట్టుకుంటూ, తనను ఎన్ కౌంటర్ చేసి చంపాలని రాజస్థాన్ పోలీసులు ప్లాన్ వేశారని ఆరోపించారు.

"దాదాపు పదేళ్ల క్రితం నాటి కేసులో నన్ను టార్గెట్ చేశారు. రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేసేందుకు వచ్చారు. నన్ను చంపాలని ప్రణాళిక వేసినట్టు కొందరు నాకు తెలిపారు. నన్ను మాట్లాడనీయకుండా చేసేందుకు స్వరపేటికను పాడు చేయాలని చూశారు" అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

 రామమందిరం, గో సంరక్షణ, రైతులకు సంక్షేమ పథకాలు తదితరాంశాలపై నేను ప్రశ్నిస్తున్నందునే ఈ పరిస్థితి ఎదురైందని, ఎవరు నాపై దాడికి యత్నించాలని చూశారన్న విషయం మాత్రం తెలియదని చెప్పారు. కాగా, ప్రవీణ్ తొగాడియా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. జెడ్ క్యాటగిరీ రక్షణలో ఉన్న ఆయన నిన్న ఉదయం మాయం కావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఆపై చంద్రమణి ఆసుపత్రిలో ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు.

More Telugu News