KTR: ఇలాంటివి మనక్కూడా అవసరం: కేటీఆర్ ట్వీట్

  • సియోల్ నుంచి డ్యాగుకు బుల్లెట్ ట్రైన్ లో పయనం
  • ఇండియాకు ఇలాంటివి అవసరమంటూ ట్వీట్
  • దక్షిణ కొరియా పెట్టుబడిదారులతో వరుస భేటీలు

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో దక్షిణ కొరియాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సియోల్ నుంచి డ్యాగు పట్టణానికి బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, అధికారులు ఉన్నారు. ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. భారత్ లోని ఏ రెండు ప్రధాన నగరాల మధ్య దూరాన్నైనా గణనీయంగా తగ్గించాలంటే ఇలాంటి వేగవంతమైన రైళ్లు రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మరోవైపు, తెలంగాణలో చేపడుతున్న పారిశ్రామిక అనుకూల చర్యలను దక్షిణ కొరియా పెట్టుబడిదారులకు వివరించామని కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యంగా వరంగల్ లో చేపడుతున్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించామని తెలిపారు. వస్త్ర తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ ఆదర్శనీయమైన గమ్యస్థలమని వివరించామని చెప్పారు.

More Telugu News