Virat Kohli: బ్రాడ్ మన్ రికార్డును సమం చేసిన కోహ్లీ!

  • టెస్టుల్లో కెప్టెన్ గా ఎనిమిది సార్లు 150 ప్లస్ స్కోర్
  • సెంచూరియన్ లో సెంచరీ కొట్టిన తొలి విదేశీ కెప్టెన్
  • దక్షిణాఫ్రికాలో రెండో శతకం

సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 153 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్ మన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. కెప్టెన్ గా 150 ప్లస్ స్కోరును ఎనిమిది సార్లు చేసిన రెండో బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు బ్రాడ్ మన్ పేరిట ఉండేది. ఈ రికార్డును కోహ్లీ తన 65వ టెస్టులో అందుకున్నాడు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ రికార్డును (ఏడు సార్లు) కోహ్లీ అధిగమించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దనే, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ లు కూడా కెప్టెన్ గా ఈ ఫీట్ ను ఏడుసార్లు సాధించారు.

మొత్తం మీద టెస్టుల్లో 150 ప్లస్ స్కోరును తొమ్మిది సార్లు సాధించాడు కోహ్లీ. మరోవైపు ఇదే మ్యాచ్ లో కోహ్లీ మరో ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో సెంచరీ సాధించిన ఆసియా దేశాల రెండో కెప్టెన్ గా అవతరించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా సెంచరీ కొట్టాడు. ఓవరాల్ గా దక్షిణాఫ్రికాలో కోహ్లీకి ఇది రెండో టెస్ట్ సెంచరీ. ఇదే గడ్డపై సచిన్ టెస్టుల్లో ఐదు సెంచరీలు బాదాడు. సెంచూరియన్ లో టెస్ట్ సెంచరీ చేసిన తొలి విదేశీ కెప్టెన్ కోహ్లీనే.  

More Telugu News