Haryna: దారుణం: 22 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి రెండు గంటలపాటు కారులో సామూహిక అత్యాచారం!

  • హరియాణాలో ఘటన
  • ఇంటికెళ్తున్న యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు
  • కారులో తిప్పుతూ అత్యాచారం

పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్తున్న 22 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు కారులో ఆమెపై రెండు గంటలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో జరిగిందీ దారుణం. శనివారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం..

విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన యువతి ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుస్తోంది. ఈ క్రమంలో స్కార్పియో కారులో వచ్చిన నలుగురు యువకులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేసి నడుస్తున్న కారులోనే  ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బల్లభ్‌గఢ్ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.  

తర్వాత ఎలాగోలా ఓపిక తెచ్చుకున్న ఆమె తన ఫోన్‌ను స్విచాన్ చేసి సోదరుడికి సమాచారం అందించింది. అంతకంటే ముందే ఆమెను గమనించిన కొందరు వాహనదారులు పోలీసు కంట్రోల్ రూముకు ఫోన్ చేసి ఆమె గురించి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 
తనపై మొత్తం నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కిడ్నాప్ చేసిన వెంటనే నిందితులు తన సెల్  ఫోన్ తీసుకుని స్విచాఫ్ చేశారని, తిరిగి వెళ్లిపోతూ దానిని ఇచ్చారని వివరించింది.  పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) హెడ్ పూజా దబ్లా పేర్కొన్నారు.

More Telugu News