KTR: పలు జిల్లాల కలెక్టర్లు అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారు: మంత్రి కేటీఆర్

  • కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్
  • గద్వాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్ వంటి జిల్లాల కలెక్టర్ల పనితీరు బాగుంది
  • చిన్న పరిశ్రమల కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలి
  • ఈ అర్థిక సంవత్సరాంతానికి కనీసం రెండుసార్లు ముద్ర లోన్ల మేళాలు నిర్వహించాలి

సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, గనుల శాఖలు నిర్వహిస్తోన్న పనులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాల నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశం జరిగింది. చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రతి నెలకి ఒకసారి జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమావేశం నిర్వహించాలని, ఆ సమావేశాల్లో చిన్న పరిశ్రమలు ఖాయిలా పడకుండా వాటికున్న సమస్యలను పరిష్కరించాలన్నారు.

జిల్లా స్థాయిలోనే బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, తద్వారా చెల్లింపుల్లో కొంత ఆలస్యానికే ఖాయిలా (సిక్) యూనిట్ గా మారకుండా చూడాలన్నారు. ఈ అర్థిక సంవత్సరాంతానికి కనీసం రెండుసార్లు ముద్ర లోన్ల మేళాలు నిర్వహించాలని కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిన్న గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి, ఈ రోజు కలెక్టర్లకు పలు ఆ-దేశాలు జారీ చేశారు. అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణాపైన కలెక్టర్లు దృష్టి సారించి, కఠినంగా వ్యవహరించాలన్నారు.

గత దశాబ్దకాలంగా పాత ప్రభుత్వాల్లో వచ్చిన రెవెన్యూ కన్నా అనేక రెట్లు ప్రస్తుత ప్రభుత్వ ఖజానాకు చేరుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇదే సమయంలో సాధారణ ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తాజాగా ఈ-సేవ సెంటర్ల ద్వారా ఇసుక బుక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వానికి అదాయం, ప్రజలకు అందుబాటులో ఇసుక అనే రెండు ప్రధానమైన అంశాల మీద ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

ఇప్పటికే గద్వాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో ఇసుక రవాణాలో అయా జిల్లాల కలెక్టర్లు పలు అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టారని, వాటిని ఇతర జిల్లాల కలెక్టర్లు సైతం అమలు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో మినరల్ పౌండేషన్ గవర్నింగ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. డి.ఎమ్.ఎమ్.ఎఫ్ కు అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తుందని, ఈ పనుల ద్వారా మైనింగ్ జరిగే ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చన్నారు.

More Telugu News