Isis: ప్రేమించి పెళ్లాడిన భార్యను ఉగ్రవాదులకు బేరం పెట్టిన కేరళవాసి!

  • గత సంవత్సరం ప్రేమ వివాహం
  • సౌదీకి తీసుకెళ్లి అసలు స్వరూపం చూపిన దుర్మార్గుడు
  • లైంగిక వేధింపులు, అశ్లీల వీడియోలు
  • అష్టకష్టాలు పడి బయటపడ్డ యువతి

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడైన కేరళకు చెందిన ఓ యువకుడు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఉగ్రవాదులకు బేరం పెట్టాడు. దాదాపు 80 రోజుల పాటు సౌదీలో ఓ గదిలో బందీగా నానా కష్టాలూ అనుభవించి, అతి కష్టం మీద ఆమె బయటపడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మహ్మద్ రియాస్ అనే వ్యక్తి బెంగళూరులో పనిచేస్తూ, గత సంవత్సరం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆపై ఆమెను తీసుకుని సౌదీకి వెళ్లాడు. ఆ తర్వాత తనలోని రాక్షసత్వాన్ని చూపాడు.

రోజూ కొడుతూ, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను పెట్టి అశ్లీల వీడియోలు తీశాడు. సిరియాలో ఉన్న ఉగ్రవాదులకు అమ్మాలని చూశాడు. ఇంట్లో నుంచి ఆమెను బయటకు రానీయకుండా కట్టడి చేశాడు. రెండున్నర నెలల తరువాత వారు లేని సమయంలో బాధితురాలు బంధువులతో మాట్లాడి, తానున్న ప్రాంతం ఫోటోలను పంపింది. దీంతో ఆమె లొకేషన్ ను గుర్తించిన బంధువులు, విమానం టికెట్లు బుక్ చేసి ఆన్ లైన్ లో పంపించగా, ఇరుగు, పొరుగు వారి సాయంతో బయటపడింది. ఓ టాక్సీ డ్రైవర్ సాయంతో ఎయిర్ పోర్టుకు చేరుకుంది. దీనిపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు మొత్తం 12 మందిపై కేసులు పెట్టి విచారణ ప్రారంభించారు.

More Telugu News