second test: రెండో టెస్ట్ నేటి నుంచే... మన బ్యాట్స్ మెన్ల కోసం ఎదురుచూస్తున్న బౌన్సీ పిచ్

  • సెంచూరియన్ లో నేటి నుంచి రెండో టెస్ట్
  • హడలెత్తించే బౌన్సీ పిచ్ 
  • టీమిండియాకు పెను సవాలే

టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్ట్ సెంచూరియన్ లో నేడు ప్రారంభం కానుంది. కేప్ టౌన్ లో బొక్కబోర్లా పడ్డ టీమిండియా ఆటగాళ్ల కోసం సెంచూరియన్ లోని బౌన్సీ పిచ్ ఎదురుచూస్తోంది. ఈ టెస్టులో మన ఆటగాళ్లు పుంజుకోవడం పెద్ద సవాలే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ఒకటే. అత్యున్నత బ్యాట్స్ మెన్ ను సైతం ముప్పుతిప్పలు పెట్టే పిచ్ ఇక్కడుంది. భారత్ సహా ఇక్కడ ఆడిన జట్లన్నీ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైన చరిత్ర ఈ పిచ్ కు ఉంది. సో, ఈ మ్యాచ్ భారత్ కు ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవచ్చు. సౌతాఫ్రికా బౌలర్లు ఈ పిచ్ పై భారత్ బ్యాట్స్ మెన్ ను హడలెత్తించడానికి కసిగా ఎదురు చూస్తున్నారు. మన వాళ్లు తెలివిగా ఆడుతూ, చెమటోడిస్తే తప్ప విజయాన్ని ఆశించలేమని అంటున్నారు.

ఈ మ్యాచ్ లో ముఖ్యంగా విరాట్ కోహ్లీ సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు తొలి టెస్ట్ లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తుది జట్టులో ఏమాత్రం మార్పులు జరిగినా, రోహిత్ కు స్థానం లభించకపోవచ్చు. ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్, కీపర్ సాహా స్థానంలో పార్థివ్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కేప్ టౌన్ లో ధావన్ పేలవమైన షాట్లకు ఔటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టెక్నికల్ గా మెరుగైన బ్యాట్స్ మెన్ అయిన రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, భువనేశ్వర్ స్థానంలో ఇశాంత్ శర్మ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం.

More Telugu News