Balakrishna: బసవ తారకం ఆసుపత్రికి పీవీ సింధు విరాళం.. ధన్యవాదాలు చెప్పిన బాలకృష్ణ!

  • రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చిన సింధు
  • విరాళం చెక్కు బాలకృష్ణకు అందజేత
  • సింధుకు, ఆమె తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పిన బాలకృష్ణ

ప్రముఖ షట్లర్ పీవీ సింధు తన ఉదారతను చాటుకుంది. బసవ తారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షలను విరాళంగా అందజేశారు. సింధు తన తల్లిదండ్రులతో కలిసి బసవ తారకం ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణను కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును ఆయనకు అందజేశారు.

 అనంతరం, సింధు మాట్లాడుతూ, కేబీసీలో బహుమతిగా గెలుచుకున్న రూ.25 లక్షలను కేన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని చెప్పింది. ఈ విరాళం ఇవ్వమని తనకు ఎవరూ చెప్పలేదని, ఈ ఆసుపత్రికి విరాళమిస్తే బాగుంటుందని ఎందుకో తనకు అనిపించిందని తెలిపింది. ఈ ఆసుపత్రి పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, అందరి దీవెనలతో మరిన్ని విజయాలు తాను సాధించాలని కోరుకుంటున్నానని సింధు చెప్పింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, పేదలకు మరిన్ని సేవలు అందించేందుకు బసవతారకం ఆసుపత్రి కృషి చేస్తుందని అన్నారు. ఏదైతే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించారో, ఆ లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. కేన్సర్ ఆసుపత్రికి విరాళమిచ్చిన సింధుకి, ఆమె తల్లిదండ్రులకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

More Telugu News