Telangana: తెలంగాణ హోంమంత్రి నాయిని సంచలన వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేలు, ఎంపీలపై బూతులు!

  • రాయలేని భాషలో ఎమ్మెల్యేలు, ఎంపీలపై విరుచుకుపడిన నాయిని
  • తెలంగాణలో టీడీపీని నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యం
  • 1969 ఉద్యమకారులకు అన్నీ ఇవ్వలేమని స్పష్టీకరణ

ఎంపీలు, ఎమ్మెల్యేలపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విరుచుకుపడ్డారు. నాడు కేసీఆర్‌ను బండబూతులు తిట్టిన వారే నేడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, రాష్ట్ర కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారని బూతు పురాణం అందుకున్నారు. రాయడానికి వీల్లేని భాషలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను తిట్టినోళ్లు నేడు ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నారని అన్నారు. తెలంగాణలో టీడీపీని కూకటివేళ్లతో పెకలించేందుకే ఆ పార్టీ నేతలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం ముద్రించిన 2018 క్యాలెండర్ ఆవిష్కరణకు హాజరైన మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చలేదని, ఆయన మగాడని కితాబిచ్చారు. తెలంగాణను అడ్డుకునేందుకు ఎన్ని శక్తులు మోహరించినా కేసీఆర్ సాధించి చూపించారని కొనియాడారు. 1969 ఉద్యమకారులను ప్రభుత్వం గౌరవిస్తుందన్న మంత్రి వారందరికీ పింఛన్లు, గుర్తింపు కార్డులు, బస్‌పాస్‌లు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

More Telugu News