bandla ganesh: కులం పేరుతో దూషించినందుకు... బండ్ల గణేష్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు!

  • ఆస్తుల కొనుగోలుకు ఒప్పందం
  • ఆస్తుల అమ్మకం తర్వాత డబ్బు చెల్లించలేదన్న బాధితులు
  • విక్రేతలను కులం పేరుతో దూషించినట్లు ఆరోపణ 

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్, అతని సోదరుడు శివబాబులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఏసీపీ సురేందర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో పౌల్ట్రీ ఫామ్ లు, భూములు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేష్ గతంలో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ ఆస్తులపై ఉన్న బ్యాంకు రుణాలను చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే, నిర్ణీత సమయంలోగా రుణాలను చెల్లించకపోవడంతో... ఈ ఆస్తులను, దిలీప్ చంద్ర ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ ఆస్తులను వారి ద్వారానే విక్రయించారు.

అయితే, తనకు రావాల్సిన డబ్బుల కోసం దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలసి బూర్గుల శివారులో గల గణేష్ పౌల్ట్రీ ఫామ్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తమను గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో దూషించారంటూ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, బండ్ల గణేష్ సోదరులపై అట్రాసిటీ కేసు నమోదైంది. 

More Telugu News