Telangana: తెలంగాణలో 546 గురుకులాలు, 475 కేజీబీవీలు, 194 మోడల్ స్కూళ్లు.. నాణ్య‌మైన విద్య‌: క‌డియం శ్రీహ‌రి

  • ఎవరికీ తీసిపోరని గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారు
  • దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు తెలంగాణలో ఉన్నాయి
  • గురుకుల పాఠశాలల్లో 8000 పోస్టులను భర్తీ చేస్తున్నాం

పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అవకాశాలు కల్పిస్తే ఎవరికీ తీసిపోరని గురుకుల విద్యార్థులు నిరూపిస్తున్నారని తెలంగాణ‌ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ -2018ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత విన్యాసాలను కొనియాడారు. ఐదు సొసైటీల నుంచి రెండువేల మంది విద్యార్థులు ఈ లీగ్ లో పాల్గొనడం సంతోషకరమన్నారు.

గత మూడేళ్లుగా ఈ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ ను నిర్వహిస్తున్నారని, దీనివల్ల వివిధ సొసైటీలలోని విద్యార్థుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు మంచి విద్య అందించాలనే సంకల్పంతో దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు తెలంగాణలో ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణలో 546 గురుకులాలు, 475 కేజీబీవీలు, 194 మోడల్ స్కూళ్లలో ఎనిమిది లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారన్నారు. గురుకులాల్లోని విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. గురుకుల పాఠశాలల్లో 8000 పోస్టులను భర్తీ చేస్తున్నామని, ఈ నెలలోపే ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తారన్నారు.

More Telugu News