golden globes: గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుక‌ల్లో కుర్చీల గోల‌... హాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశం!

  • స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ ద‌గ్గ‌ర కూర్చునేందుకు పోటీప‌డ్డ న‌టీమ‌ణులు
  • టాక్ షోలో వెల్ల‌డించిన మెరిల్ స్ట్రీప్‌
  • క్ష‌మాప‌ణ‌లు తెలిపిన మ‌రియా కేరీ

ప్రతిష్ఠాత్మ‌క గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుక‌లో కుర్చీల కోసం చిన్న గొడ‌వ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఈ గొడ‌వ హాలీవుడ్ సీనియ‌ర్ న‌టీమ‌ణి మెరిల్ స్ట్రీప్‌, పాప్ సింగర్ మ‌రియా కేరీల మ‌ధ్య జ‌రిగింది. అవార్డు వేడుక‌ల అనంత‌రం జిమ్మీ కెమ్మెల్ లైవ్ షోలో పాల్గొన్న మెరిల్ ఈ విష‌యం గురించిన సంగ‌తుల‌ను బ‌య‌ట‌పెట్టింది. అందులో భాగంగా మ‌రియా కేరీని అస‌భ్యంగా సంబోధించ‌డం ఇప్పుడు హాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రియా కేరీ, మెరిల్ స్ట్రీప్ సీటును ఆక్ర‌మించ‌డంపై జిమ్మీ అడ‌గ్గానే మెరిల్ త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పింది. స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ ద‌గ్గ‌ర కూర్చునేందుకు ఆమె అలా చేసిందంటూ కొన్ని త‌ప్పుడు ప‌దాల‌ను కూడా వాడింది. ఈ వీడియోను జిమ్మీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే అనుకోకుండా కూర్చున్నందుకు మ‌రియా, మెరిల్‌కు వ్య‌క్తిగ‌తంగా క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ట్విట్ట‌ర్‌లో కూడా ఆమె క్ష‌మాప‌ణ‌లు తెలిపింది.

విశ్రాంతి స‌మ‌యంలో తాను బ‌య‌టికి వెళ్లాన‌ని, అప్పుడు ఒక్క‌సారిగా కార్య‌క్ర‌మం ప్రారంభమ‌వుతుంద‌ని ఎక్క‌డి వాళ్లు అక్క‌డే కూర్చోవాల‌ని చెప్పార‌ని, అందుకే ఖాళీగా ఉన్న మెరిల్ సీట్లో కూర్చున్న‌ట్లు మ‌రియా చెప్పింది. ఆ స‌మయంలో అక్క‌డ మెరిల్ లేక‌పోవ‌డం, త‌ర్వాత కాసేప‌టికి అక్క‌డికి రావ‌డంతో చిన్న చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.
 

More Telugu News