pocharam srinivas rededy: దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది: మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి

  • పంట పెట్టుబడి పథకం నగదు నేరుగా రైతులకు చేరాలన్నదే మా లక్ష్యం
  • రైతులకు ఉన్న బ్యాంకు ఖాతాలోనే రూ.4000 నగదును జమచేద్దామనుకున్నాం
  • అయితే, పాత బకాయిల కింద కట్ చేస్తారని రైతులు అనుమానిస్తున్నారు
  • దీనిపై చర్చిస్తున్నాం

రాష్ట్రంలో సమర్థవంతంగా జరుగుతోన్న అభివృద్ధి పనుల నేపథ్యంలో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంద‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రెవెన్యూ రికార్డు ప్రక్షాళన తర్వాత కేటగిరి 'ఏ' కింద రాష్ట్రంలో 71,75,000 మంది రైతు ఖాతాలు ఉన్నట్లు లెక్క తేలిందని చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి ముందస్తు పెట్టుబడిగా ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.4000ను అందించాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన క్యాబినేట్ సబ్ కమిటీ ఈ రోజు సమావేశమై చర్చించింది.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... "కమిటీ సభ్యులం గ్రామాలలో సభలు, సమావేశాల ద్వారా రైతులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నాం. జనవరి 10న మరోసారి సమావేశం అవుతాం. ప్రభుత్వం ఇచ్చే ఈ పంట పెట్టుబడి పథకం నగదు నేరుగా రైతులకు చేరాలన్నదే లక్ష్యం. ప్రస్తుతం రైతులకు ఉన్న బ్యాంకు ఖాతాలోనే ఈ నగదును జమ చేసినట్లయితే పాత బకాయిల కింద జమకడతారని రైతులు అనుమానం వ్యక్తం చేయడం సహజం. దీని కోసం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అభిప్రాయాన్ని అడిగాం. వారు మరుసటి సమావేశంలో చెబుతామన్నారు. అందరి అభిప్రాయాలను, సలహాలను పరిగణనలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటాం" అని వ్యాఖ్యానించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, హరీశ్ రావు, ఈటల రాజేందర్, కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మ, వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి, ఆర్ధిక శాఖ కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయ శాఖ కమిషనర్ యం.జగన్మోహన్, తదితరులు పాల్గొన్నారు. 

More Telugu News